TSPSC Exams : మే నెలలో టీఎస్పీఎస్సీ పరీక్షల నిర్వహణకు ప్లాన్!
24 March 2023, 5:52 IST
TSPSC Exams Schedule : ప్రశ్నాపత్రం లీక్ కావడంతో TSPSC గతంలో వివిధ రిక్రూట్మెంట్ పరీక్షలను రద్దు చేసింది, వాయిదా వేసింది. అయితే జూన్ 11న గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించాలని నిర్ణయించింది.
టీఎస్పీఎస్సీ అలర్ట్
'పరీక్ష తేదీలు, ఫూల్ ప్రూఫ్ పద్ధతిలో ఎలా నిర్వహించాలనే దానిపై సమావేశంలో చర్చించారు. శుక్రవారం తేదీలు ఖరారు కానున్నాయి. తాత్కాలికంగా, పరీక్షలు మే నెలలో ప్రారంభమవుతాయి.' అని వర్గాలు తెలిపాయి.
TSPSC Online Exams: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీ నేపథ్యంలో మార్పులు తీసుకురావాలని కమిషన్ యోచిస్తోంది. పోటీపరీక్షల నిర్వహణ విధానంలో కీలక మార్పులు చేపట్టాలని పబ్లిక్ సర్వీస్ భావిస్తోంది. వేగంగా రాత పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించేందుకు ఆన్లైన్ విధానాన్ని అమలు చేయాలని అనుకుంటోంది.
పరీక్ష పత్రాల తయారీ, భద్రత, సాంకేతిక ఇబ్బందులు లేకుండా, పరీక్షలకు అవసరమైన ప్రశ్నలను పెద్ద సంఖ్యలో క్వశ్చన్ బ్యాంక్ తయారు చేయాలని భావిస్తున్నారు. అభ్యర్థుల సంఖ్య ఎంత ఉన్నా విడతల వారీగా పరీక్షలు నిర్వహించడం ద్వారా ఏ దశలోను పేపర్ లీక్ అనే వివాదం తలెత్తకుండా చూడాలని యోచిస్తున్నారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ప్రస్తుతం 25వేల మంది అభ్యర్థులు హాజరయ్యే పరీక్షలకు మాత్రమే కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తున్నారు. అంతకు మించి అభ్యర్థులు హాజరయ్యే పరీక్షలకు కూడా ఆన్లైన్ పరీక్షా విధానాన్ని విస్తరించనున్నారు.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థులందరికీ ఒకేసారి కాకుండా విడతల వారీగా పరీక్షలు నిర్వహించి, నార్మలైజేషన్ విధానం అమలు చేయాలని భావిస్తోంది. ప్రొఫెషనల్ పోస్టుల ఉద్యోగాలతో ప్రారంభించి, భవిష్యత్తులో అన్ని ఉద్యోగాలకు ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లేదా ఓఎంఆర్ విధానంలో నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ఉద్యోగ ప్రకటనలో స్పష్టంగా పేర్కొన్నారు.
ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరగడంతో లక్షల సంఖ్యలో అభ్యర్థులకు ఒకేరోజున పరీక్షలు నిర్వహించడం సవాళ్లతో కూడుకుంటోంది. తెలంగాణలో ప్రస్తుతం 25వేల మంది అభ్యర్థుల వరకు మాత్రమే ఆన్లైన్ పరీక్షలు నిర్వహించేందుకు మౌలిక వనరులు ఉన్నాయి.
ఇంజినీరింగ్, ప్రొఫెషనల్ కళాశాలల్లోని కంప్యూటర్ ల్యాబ్లు వినియోగించుకుంటే 50వేల మంది వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అభ్యర్థుల సంఖ్య ఇంకా పెరిగినా ఇబ్బందులు లేకుండా అవసరమైతే విడతల వారీగా నిర్వహించాలని కమిషన్ యోచిస్తోంది. ఇంజినీరింగ్, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పరీక్షలు, విధానంపై ఇప్పటికే అభ్యర్థుల్లో అవగాహన ఉండటంతో అభ్యర్థులకు కష్టం కాదని భావిస్తోంది.