TRS On Symbols : తొలగించారుగా.. మళ్లీ ఎలా వచ్చింది.. ఈసీ దగ్గరకు టీఆర్ఎస్
19 October 2022, 6:23 IST
- Munugode By Election : మునుగోడు ఉపఎన్నిక గుర్తులపై టీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై ఈసీ వద్దకు టీఆర్ఎస్ వెళ్లింది. గుర్తును మార్చాలని కోరింది.
దిల్లీలో వినోద్ కుమార్
తెలంగాణ రాష్ట్ర సమితి(TRS) దిల్లీలో ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయాని ఒకేలా గుర్తుల ఉన్న సమస్యను తీసుకెళ్లింది. మునుగోడు ఉప ఎన్నిక (Munugode Bypoll)ల్లో ఇండిపెండెంట్లకు కారు గుర్తుకు సమానమైన గుర్తులను ఈసీ కేటాయించడంపై పార్టీ మాజీ ఎంపీ బి. వినోద్ కుమార్, అదనపు అడ్వకేట్ జనరల్ జె.రామచంద్రరావు ఎన్నికల సంఘం(Election Commission) అధికారులను కలిశారు. ఇది ఓటర్లను గందరగోళానికి గురిచేసి ఎన్నికల్లో టీఆర్ఎస్(TRS) అవకాశాలను దెబ్బతీసే అవకాశం ఉన్నందున స్వతంత్రులకు కేటాయించిన టీఆర్ఎస్ పోలిన గుర్తులను రద్దు చేయాలని వారు ఈసీని కోరారు.
స్వతంత్ర అభ్యర్థికి కేటాయించిన 'రోడ్ రోలర్' గుర్తు(Road Roller Symbol)ను వినోద్ తీవ్రంగా తప్పుబట్టారు. 2011లో టీఆర్ఎస్ ఫిర్యాదు చేయడంతో ఈసీ రోడ్డు రోలర్ను ‘ఉచిత గుర్తుల’ జాబితా నుంచి తొలగించిందని ఆయన దృష్టికి తెచ్చారు. గుర్తు ఎలా తిరిగి వచ్చిందో అని వినోద్ కుమార్(Vinod Kumar) ఆశ్చర్యపోయారు. కేంద్ర ఎన్నికల కమిషన్ సభ్యులు అనూప్ చంద్ర పాండే దృష్టికి తీసుకెళ్లారు.
మునుగోడు అసెంబ్లీ(Munugode Assembly) స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థికి రోడ్డు రోలర్ గుర్తు కేటాయించటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులకు లేఖను వినోద్ కుమార్ అందజేశారు. రోడ్డు రోలర్ గుర్తును మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల(Assembly Bypoll) పోటీ జాబితా నుంచి తొలగించాలని కోరారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేయడం వల్ల 2011 సంవత్సరంలో రోడ్డు రోలర్ గుర్తును తొలగించిన విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారుల దృష్టికి వినోద్ కుమార్, రాంచందర్ రావు తీసుకుని వచ్చారు.
ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు 'ఉచిత చిహ్నాల' జాబితా నుండి కెమెరా, చపాతీ రోలర్, డోలీ, రోడ్ రోలర్, సబ్బు డిష్, టెలివిజన్, కుట్టు మిషన్, షిప్ అనే ఎనిమిది చిహ్నాలను తొలగించాలని వినోద్ కుమార్ కోరారు.