BJP Vs TRS In Munugode : గతంలో బీజేపీ మాటలే.. మునుగోడులో టీఆర్ఎస్ గుర్తుచేస్తోంది
Munugode By Election : మునుగోడులో బీజేపీని గట్టిగా దెబ్బకొట్టాలని టీఆర్ఎస్ భావిస్తోంది. దీనికి తగ్గట్టుగానే ప్రణాళికలు వేస్తోంది. కొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోంది. బీజేపీ వాగ్దానాలను ఎత్తిచూపుతూ ఓట్లను అడుగుతోంది.
బీజేపీ(BJP) చేస్తున్న వాగ్దానాల ఎత్తిచూపుతూ మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ టార్గెట్ చేస్తోంది. బీజేపీ గెలిచిన దుబ్బాక, హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు ఆ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకున్న జీహెచ్ఎంసీ(GHMC) ఎన్నికలను గుర్తుచేస్తోంది. ‘బూటకపు వాగ్దానాల’ను నమోద్దని ప్రజల్లోకి వెళ్తోంది టీఆర్ఎస్.
2020లో జరిగిన దుబ్బాక(Dubbaka) ఉపఎన్నిక, 2021లో హుజూరాబాద్ బైపోల్ ముందు పేదలకు, నిరుద్యోగులకు రూ.3,000 పింఛన్ అంశాన్ని గుర్తుచేస్తోంది. అలాగే 2020లో జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ వరదల్లో దెబ్బతిన్న బైక్కు బైక్, కారుకు కారు, ఫర్నిచర్కు ఫర్నిచర్ ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. అయితే ఈ విషయాలనే టీఆర్ఎస్ నేతలు ప్రస్తావిస్తున్నారు. బీజేపీ హామీలు హామీలు మాత్రమేనని నెరవేర్చరని టీఆర్ఎస్(TRS) నేతలు చెబుతున్నారు.
మునుగోడు(Munugode) నియోజకవర్గానికి పార్టీ ఎన్నికల ఇన్ ఛార్జీలుగా నియమితులైన మెదక్(Medak), సిద్దిపేట, హైదరాబాద్ జిల్లాల టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు మునుగోడులో మకాం వేశారు. తమ జిల్లాల నుంచి మునుగోడుకు బృందాలుగా ప్రజలను రప్పించి ఓటర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీకి చెందిన ప్రజలు బీజేపీ వాగ్దానాల గురించి ఓటర్లను హెచ్చరిస్తూ బ్యానర్లు పెడుతున్నారు. 'మునుగోడు ప్రజలారా మేం మోసపోయాం, మీరు మోసపోకండి' అని బ్యానర్లు రాసి ఉన్నాయి. 'దుబ్బాక, హుజూరాబాద్లో బీజేపీని నమ్మి మోసపోయాం.. దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో బీజేపీ(BJP) హామీ ఇచ్చిన రూ.3 వేల పింఛన్ ఇవ్వలేదు.. మునుగోడు ప్రజలారా.. బీజేపీతో జాగ్రత్తగా ఉండండి ' అని పలు బ్యానర్లు వేశారు.
దుబ్బాక, హుజూరాబాద్లో బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్రావు, ఈటల రాజేందర్(Etela Rajender)లు చేసిన వాగ్దానాల వాల్పోస్టర్లను టీఆర్ఎస్ కార్యకర్తలు మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా అతికించారు. నిరుద్యోగులకు రూ.3 వేల పింఛన్, చేనేత, బీడీ కార్మికులకు రూ.3 వేల పింఛన్, రైతులకు ఉచిత ఎరువులు, కార్పొరేట్ పాఠశాలలు, నిరుద్యోగులకు, మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు వంటివి దుబ్బాక ఉపఎన్నిక సందర్భంగా బీజేపీ చేసిన వాగ్దానాలను టీఆర్ఎస్ హైలైట్ చేస్తోంది. దుబ్బాకకు ఔటర్ రింగ్ రోడ్డు, మిర్దొడ్డి, చెంగుంటలకు డిగ్రీ కళాశాలలు, పేద వర్గాల ఆడపిల్లల పెళ్లిళ్లకు ఉచిత బంగారు 'తాళి బొట్టు', ఉపాధి కల్పనకు కొత్త పరిశ్రమలు లాంటివి గుర్తుచేస్తోంది.
హుజూరాబాద్(Huzurabad)కు సంబంధించి నియోజకవర్గంలోని రైల్వే స్టేషన్ల అభివృద్ధి, వంతెనల నిర్మాణం, పీఎం కిసాన్(PM Kisan) కింద రైతులకు రూ.3,000 పింఛన్ లాంటివి టీఆర్ఎస్ గుర్తుచేస్తోంది. భారతదేశం, విదేశాల్లోని పేద విద్యార్థుల చదువుకు విద్యాలక్ష్మి పథకం కింద బీజేపీ హామీలు ఏమయ్యాయని టీఆర్ఎస్ అడుగుతోంది.
సంబంధిత కథనం