ED Raids In HYD : హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు-enforcement directorate again searches in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ed Raids In Hyd : హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు

ED Raids In HYD : హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు

HT Telugu Desk HT Telugu
Oct 17, 2022 02:59 PM IST

Delhi Liquor Scam : దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ అధికారులు దూకుడు పెంచుతున్నారు. తాజాగా మరోసారి హైదరాబాద్ లో సోదాలు చేశారు.

ఈడీ సోదాలు
ఈడీ సోదాలు ((Facebook) )

దిల్లీ లిక్కర్ స్కామ్ ను ఈడీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇందులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ దూకుడు పెంచింది. తాజాగా మరోసారి హైదరాబాద్(Hyderabad)లో బృందాలుగా ఏర్పడి పలుచోట్ల అధికారుల సోదాలు చేస్తున్నారు. ఎర్రమంజిల్ లో తనిఖీలు జరుగుతున్నాయి.

ఇప్పటికే ఈ కేసులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు చోట్ల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించింది. కరీంనగర్‌(Karimnagar) జిల్లాకు చెందిన వెన్నమనేని శ్రీనివాసరావును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు గతంలో గంటల పాటు ప్రశ్నించారు. ఈ దర్యాప్తులో కీలక సమాచారం రాబట్టారు. ఇప్పటికే హైదరాబాద్ లో నాలుగు విడతల సోదాలు జరిగాయి. తాజాగా మరోసారి ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. ఈ కేసులో నిందితుల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.

మరోవైపు దిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam) కేసులో అభిషేక్‌ రావు సీబీఐ కస్టడీ పొడిగించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఇద్దరిని సీబీఐ అరెస్ట్‌ చేసింది. సమీర్‌ మహీంద్రు, విజయ్‌ నాయర్‌లను అదుపులోకి తీసుకుంది. లిక్కర్‌ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బోయినపల్లి అభిషేక్‌ బ్యాంకు ఖాతా నుంచి మీడియా సంస్థ ఖాతాకు నగదు బదిలీ జరిగినట్టుగా ప్రచారం ఉంది. మనీలాండరింగ్‌ కోణంలోనూ ఆరా తీస్తున్నారు.

దిల్లీలో లిక్కర్ టెండర్లు దక్కించుకునేందుకు ఈ ముఠా నగదు లావాదేవీలు జరిపినట్లు సీబీఐ(CBI) అభియోగాలు నమోదు చేసింది. ఇండో స్పిరిట్స్‌ డైరెక్టర్‌ గా ఉన్న సమీర్‌ మహీంద్రుతో కలిసి రామచంద్ర పిళ్లై ఒప్పందాలు చేసుకున్నారని ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ కేసులో తదుపరి అరెస్టు ఎవరు అనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం