AP BJP : ప్రధాన ప్రతిపక్షం కోసం బీజేపీ పక్కా స్కెచ్
Andhra Pradesh Politics : ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షం స్థానాన్ని ఆక్రమించుకోవాలని బీజేపీ చూస్తోంది. క్రమంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా మారేందుకు తన వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించింది.
రాష్ట్రంలో అధికార పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ(BJP) జాతీయ నాయకులు, స్థానిక నాయకులు ఇటీవలి దూకుడు వైఖరి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రజా పోరు యాత్ర కింద 26 జిల్లాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాషాయ దళం బహిరంగ సభలు నిర్వహిస్తోంది.
ట్రెండింగ్ వార్తలు
పార్టీ వర్గాల ప్రకారం టీడీపీ(TDP)తో పొత్తు.. బీజేపీ బలోపేతం చేయడంలో సహాయపడలేదని అభిప్రాయం ఉంది. అయితే అది టీడీపీకి ఎక్కువ సీట్లు రావడానికి సహాయపడింది. మొదట ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవించిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో అధికారంలోకి రావడంలో తాము విజయం సాధించామని బీజేపీ(BJP) అనుకుంటోంది. తెలంగాణ రాష్ట్రంలోనూ అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదని, జనసేనతో పొత్తు కొనసాగుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
వ్యతిరేకతను నిలువరించడానికి ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పిలుపునిచ్చారు. అయితే ఇది విపక్షాలలోని ఒక వర్గం ఎత్తుగడ అని బీజేపీ కేంద్ర నాయకత్వం అర్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో టీడీపీ.. తమ పార్టీ ఎదుగుదలకు ఉపయోగపడదని బీజేపీ హైకమాండ్ గ్రహించింది. సెప్టెంబర్ 17న 175 అసెంబ్లీ(Assembly) నియోజకవర్గాల్లో ప్రజాపోరు సమావేశాలను ప్రారంభించగా, ఇది అక్టోబర్ 5 వరకు కొనసాగనుంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, వై సత్యకుమార్, సునీల్ దేవధర్, పీవీఎన్ మాధవ్, కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ నరసింహారావు, వాకాటి నారాయణ రెడ్డి లాంటి నేతలు వైసీపీపై పోరుకు సిద్ధమవుతున్నారు. జగన్ ప్రభుత్వంపై ప్రజాపోరు సమావేశాల సందర్భంగా విమర్శలు చేస్తున్నారు.
విజయవాడలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్.. వైసీపీ(YSRCP), రెడ్డిలపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించాయని సీనియర్ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)కు కేంద్రం చేసిన పనులను చెప్పేందుకు కేంద్ర మంత్రులు ఎస్. జైశంకర్, హర్దీప్ సింగ్ పూరి, జి. కిషన్ రెడ్డి, డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, బీజేపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. మరికొద్ది నెలల్లో బీజేపీ అగ్రనేతల పర్యటనలు ఉండే ఛాన్స్ ఉంది.
బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, జాతీయ OBC మోర్చా అధ్యక్షుడు కె.లక్ష్మణ్, రాష్ట్ర కో ఇంఛార్జి సునీల్ దేవధర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో పొత్తును తోసిపుచ్చారు. అమరావతి సహా వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, టీడీపీకి వ్యతిరేకంగా బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని దేవధర్ అన్నారు.