Crime news | 'ఓవెన్'లో పసికందు మృతదేహం.. తల్లిదే నేరం!
22 March 2022, 11:36 IST
- ఢిల్లీలో ఓ రెండు నెలల పసికందు మృతదేహం.. మైక్రోవేవ్ ఓవెన్లో కనిపించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. కాగా.. ఇందులో పసికందు తల్లి హస్తం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఓవెన్లో పసికందు మృతదేహం
Infant found dead in microwave | దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చిరాగ్ దిల్లీ ప్రాంతంలో ఓ రెండు నెలల పసికందు మృతదేహం ఓ మైక్రోవేవ్ ఓవెన్లో కనిపించింది. పసికందు తల్లే ఈ దారుణానికి ఒడిగట్టిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..
పసికందు మరణవార్త గురించి సోమవారం మధ్యాహ్నం 3:15 గంటలకు పోలీసులకు సమాచారం అందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పసికందు తల్లిదండ్రులు గుల్షన్ కౌషిక్, డింపుల్ కౌషిక్లను ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఈ ఘటనలో పసికందు తల్లి పాత్ర ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆడబిడ్డ పుట్టుందనే కారణంతో తల్లి.. ఆమెను చంపి ఉండొచ్చని భావిస్తున్నారు.
"ఈ ఏడాది జనవరిలో పసికందు పుట్టింది. ఆమెకు అనన్య అనే పెట్టారు. కానీ ఆడబిడ్డ పుట్టిందని డింపుల్ బాధపడేది. ఇదే విషయంపై భర్తతో అనేకమార్లు గొడవ పడింది," అని ఆ కుటుంబంతో సంబంధం ఉన్న కొందరు మీడియాకు వెల్లడించారు.
గుల్షన్, డింపుల్కు అనన్య.. రెండో సంతానం. వారికి ఓ నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు.
ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చిన పొరుగింటి వ్యక్తి.. సోమవారం జరిగిన పరిణామాలను వెల్లడించాడు. "డింపుల్.. ఇంటి డోర్ను లాక్ చేసుకుని లోపలే ఉండిపోయింది. ఆమె అత్త ఎన్నిసార్లు తలుపు కొట్టినా డింపుల్ డోర్ తెరవలేదు. ఇంట్లోని ఓ గ్లాస్ను పగలగొట్టి మేము లోపలికి ప్రవేశించాము. కొడుకు వద్ద.. అపస్మారక స్థితిలో పడి ఉన్న డింపుల్ను మేము చూశాము. కానీ పసికందు కనిపించలేదు. తర్వాత.. అనన్య నాన్నమ్మ, ఇరుగుపొరుగు వారందరు ఆమె కోసం ఇల్లంతా వెతికారు. చివరికి..రెండో అంతస్తులో ఉన్న ఓవెన్లో రెండు నెలల పసికందు మృతదేహం కనిపించింది," అని వెల్లడించాడు.
ఘటన జరిగిన సమయంలో మహిళ భర్త గుల్షన్ కౌషిక్.. బయటకు వెళ్లినట్టు తెలుస్తోంది.
టాపిక్