Indigo plane engine catches fire : టేకాఫ్ సమయంలో విమానం ఇంజిన్లో మంటలు
29 October 2022, 6:36 IST
Indigo plane engine catches fire : టేకాఫ్కి ఐదు సెకన్ల ముందు.. ఇంజిన్లో మంటలు చెలరేగడంతో.. ఇండిగో విమానం నిలిచిపోయింది. ఈ ఘటన ఢిల్లీ విమానాశ్రయంలో జరిగింది. ఘటనలో ఎవరికీ హాని జరగలేదు.
టేకాఫ్ సమయంలో విమానం ఇంజిన్లో మంటలు!
Indigo plane engine catches fire : ఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళుతున్న ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది! టేకాఫ్ సమయంలో.. విమానం ఇంజిన్కు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన పైలట్లు.. విమానాన్ని వెంటనే నిలిపివేశారు.
ఏం జరిగింది?
ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఇండిగో ఫ్లైట్ 6ఈ-2131 బెంగళూరుకు బయలుదేరాల్సి ఉంది. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఘటన జరిగిన సమయంలో ఇండిగో విమానంలో ప్రయాణికులు, సిబ్బందితో కలుపుకుని మొత్తం మీద 184మంది ఉన్నారు. కాగా.. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు.
రాత్రి 9:45 గంటల ప్రాంతంలో ఇండిగో విమానం ఇంజిన్లో మంటలు అంటుకోగా.. విమానంలోని ప్రయాణికులు 11 గంటల తర్వాత బయటకు వచ్చారు. అర్ధరాత్రి దాటిన తర్వాత.. వారిని వేరే విమానంలో ఎక్కించి బెంగళూరుకు పంపించారు అధికారులు.
Indigo plane caught fire : ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ప్రయాణికుల్లో ఒకరు ఈ వీడియో తీశారు. విమానం టేకాఫ్ జరుగుతుండగా.. ఒక్కసారిగా మంటలు రాజుకున్నాయి. ఆ మంటలు వెంటనే పెరిగాయి. పైలట్ల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పిందని అందరు ఊపిరి పీల్చుకున్నారు.
"విమానం ఇంకో 5-7 సెకన్లలో టేకాఫ్ అయ్యేది. అప్పుడే నేను.. విమానం రెక్కల వద్ద మంటలు చూశాను. ఆ వెంటనే అది పెరిగిపోయింది. విమానం వెంటనే ఆగిపోయింది. ఇంజిన్లో లోపం తలెత్తిందని పైలట్ మాకు చెప్పారు," అని ఇండిగో విమానం లోపల ఉన్న ప్రయాణికుల్లో ఒకరు చెప్పారు.
Delhi Bengaluru Indigo plane : "ఆ సమయంలో లోపల తీవ్ర గందరగోళం నెలకొంది. కానీ సిబ్బంది మాకు హామీ ఇచ్చారు. పరిస్థితిని అదుపు చేశారు. మాకు మంచి నీరు ఇచ్చారు. విమానంలో వృద్ధులు, పిల్లలు చాలా మంది ఉన్నారు. అందరు సురక్షితంగానే ఉన్నారు. మరో విమానంలో మమ్మల్ని తీసుకెళతామని చెప్పారు," అని ప్రయాణికులు వివరించారు.
ఇండిగో ప్రకటన..
ఇండిగో విమానం ఇంజిన్లో మంటలు చెలరేగిన ఘటనపై సంస్థ ఓ ప్రకటన చేసింది.
Indigo flight : "టేకాఫ్ సమయంలో ఇంజిన్లో మంటలు చెలరేగాయి. టేకాఫ్ని నిలిపివేశారు. విమానాన్ని భద్రంగా వెనక్కి తీసుకొచ్చారు. ప్రయాణికులను వేరే విమానంలో గమ్యస్థానానికి పంపిస్తున్నాము. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము," అని ఇండిగో సంస్థ పేర్కొంది.
ఘటనను తీవ్రంగా పరిగణించిన విమానాయనశాఖ.. దర్యాప్తు చేపట్టనున్నట్టు తెలిపింది.
కాగా.. ఇటీవలి కాలంలో విమాన ప్రమాద ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి ఘటనలు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు.