Revanth Reddy Comments : బ్రిటీషర్లకు కేసీఆర్, మోదీ ఏకలవ్య శిష్యులు
02 October 2022, 19:46 IST
- Revanth Reddy On KCR : సీఎం కేసీఆర్, ప్రధాని మోదీలు బ్రిటీషర్లకు ఏకలవ్య శిష్యులుగా తయారు అయ్యాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టి అధికారం పదిలం చేసుకోవాలని చూస్తున్నారని విమర్శించారు.
రేవంత్ రెడ్డి
బోయిన్పల్లిలో గాంధీ జయంతి వేడుకల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) పాల్గొన్నారు. కేసీఆర్(KCR), మోదీ(Modi) కుట్రలను తిప్పికొట్టడానికి గాంధేయవాదులంతా ఏకమై ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాల్లో శాంతి కోరుకునే వారికి.. అమెరికా నుంచి ఆఫ్రికా వరకు నెల్సన్ మండేలా లాంటి ఎందరో నాయకులకు గాంధీ స్ఫూర్తిగా నిలిచారన్నారు.
'ప్రపంచానికి గాంధీ ఇజాన్ని పరిచయం చేసిన గొప్ప వ్యక్తి బాపూజీ. గాంధీ ఇజం చరిత్రలోనే నిలబడింది. వందల సంవత్సరాలు ఈ దేశంపై ఆధిపత్యం చలాయించిన బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ఎదురోడి దేశానికి స్వాతంత్య్రం తెచ్చారు. ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా, డూ ఆర్ డై నినాదంతో గాంధీ ప్రపంచానికి పరిచయం అయ్యారు. గాంధీ(Gandhi) స్పూర్తితో కాంగ్రెస్ పార్టీ బాక్రానంగల్ నుంచి నాగార్జున సాగర్ వరకు హరిత విప్లవానికి జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహుదూర్ శాస్త్రీ పునాది వేశారు.' అని రేవంత్ రెడ్డి అన్నారు.
బడుగు బలహీన వర్గాల వారికి హక్కులు కల్పించింది కాంగ్రెస్ పార్టీ(Congress Party) అని రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ల నేతృత్వంలో అభివృద్ధికి ఎన్నో చర్యలు చేపట్టినట్టుగా పేర్కొన్నారు. బడుగు, బలహీన, గిరిజన, మైనార్టీలకు హక్కులు కల్పించింది కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు. కేసీఆర్, మోదీలు బ్రిటీషర్లకు ఏకలవ్య శిష్యులుగా తయారు అయ్యారని వ్యాఖ్యానించారు.
'భారతీయ జనతా పార్టీ(bharatiya janata party) అనే విషవృక్షం దేశాన్ని కబళించాలని చూస్తోంది. దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టి అధికారం పదిలం చేసుకోవాలని చూస్తున్నారు. కుట్రలను తిప్పికొట్టడానికి గాంధేయవాదులంతా ఏకమై ముందుకు రావాలి.' అని రేవంత్ రెడ్డి అన్నారు.
రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తూ దేశాన్ని ఏకీకృతం చేస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పాదయాత్ర అనంతరం ఈ నెల 24న పాదయాత్ర తెలంగాణలోకి వస్తుందని చెప్పారు. గాంధీ స్పూర్తితో అందరం భారత్ జోడో యాత్రలో కదం కలపాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ విభజించు పాలించు అనే సూత్రం ప్రకారం పరిపాలిస్తున్నారని ఆరోపించారు.