TPCC : మళ్లీ టీపీసీసీలో లొల్లి.. లొల్లి.. సంచలన ప్రకటన చేస్తానన్న జగ్గారెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ విభేదాలు రచ్చకెక్కాయి. సోమవారం సంచలన ప్రకటన చేస్తానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటించారు.
టీపీసీసీలో మళ్లి వివాదం మెుదలైంది. వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీద విమర్శలు గుప్పించారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పర్యటనపై చర్చించలేదని ఆరోపించారు. ఎలాంటి సమావేశం ఏర్పాటు చేయకుండానే తమతో చర్చించినట్లు చెప్పుకొచ్చారన్నారు. గోడకు వేసి కొడతా అంటూ అవమానపరిచేలా రేవంత్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అలా రెచ్చగొట్టడం వల్లే తాను మీడియా ముందుకు వచ్చానని జగ్గారెడ్డి చెప్పారు. రాజకీయ యుద్ధం చేయాలంటే వ్యూహం ఉండాలని హితవు పలికారు.
ట్రెండింగ్ వార్తలు
'పార్టీ రేవంత్ అయ్య జాగీరు కాదు, ఆయనెవరు సిన్హాను కలవొద్దనడానికి? దీనిపై అగ్రనేతలకు ఫిర్యాదు చేస్తా. సీనియర్ నాయకుడైన హనుమంతరావును గోడకేసి కొడతానంటావా? ఆయన సిన్హాను కలవడంలో తప్పులేదు. సిన్హాను పక్కన కూర్చోబెట్టుకుని రాహుల్గాంధీ నామినేషన్ వేయించారు. మేం నీకు నౌకర్లమా? బంట్రోతులమా?. సీఎల్పీకి చెప్పకుండానే జిల్లా నేతలకు కండువా కప్పుతున్నాడు. పార్టీ వ్యవహారాలు బయటపెట్టనని రాహుల్గాంధీకి ఇచ్చిన మాట తప్పినందుకు ఆయనకు క్షమాపణలు చెబుతున్నా.’ అని జగ్గారెడ్డి శనివారం మాట్లాడారు.
తెలంగాణలో రాహుల్గాంధీ పర్యటన తర్వాత కూడా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీరు మారలేదని ప్రెసిటెండ్ జగ్గారెడ్డి ఆరోపిస్తున్నారు. యశ్వంత్ సిన్హా హైదరాబాద్ పర్యటనపై రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలతో చర్చించలేదని తెలిపారు. పార్టీ శ్రేణులతో సమావేశం ఏర్పాటు చేయకుండానే చర్చించినట్లు మాట్లాడుతున్నారని.. అవన్నీ అవాస్తవాలేనన్నారు. రేవంత్ రెడ్డి విపరీత ధోరణి వల్లే తాను మీడియా ముందుకు వచ్చి మాట్లాడానని మరోసారి చెప్పారు. ఈ వివాదంపై రేపు సంచలన ప్రకటన చేస్తానని జగ్గారెడ్డి చెప్పారు.
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్కుమార్ యాదవ్ను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. అక్కడ ఆయనను కలిసేందుకు రేవంత్ రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఇదే సమయంలో సిన్హాను వీహెచ్ కలిసిన విషయాన్ని విలేకరులు అడిగారు. ఆ ఇంటిమీద వాలిన కాకి ఈ ఇంటిమీద వాలితే ఊరుకోమని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ను కలిసిన వ్యక్తి బ్రహ్మదేవుడైనా కలిసేది లేదని స్పష్టం చేశారు. ఇందుకోసమే.. యశ్వంత్సిన్హాను కలవలేదన్నారు. జాతీయ నాయకత్వంతో మాట్లాడే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. పార్టీ నేతలు ఎవరైనా అతిక్రమిస్తే చూస్తూ ఊరుకోం.. తీసి గోడకేసి కొడతామని వ్యాఖ్యానించారు. ఈ మాటలపై జగ్గారెడ్డి సీరియస్ అయ్యారు.
సంబంధిత కథనం