Zerodha down : జెరోధా సేవలకు తీవ్ర అంతరాయం.. ట్రేడర్లకు నష్టాలు!
11 August 2022, 11:04 IST
Zerodha down : జెరోధా సేవలకు గురువారం ఉదయం తీవ్ర అంతరాయం ఏర్పడింది. సామాజిక మాధ్యమాల్లో యూజర్లు తమ అసంతృప్తిని బయటపెట్టారు.
జెరోధా సేవలకు తీవ్ర అంతరాయం.. ట్రేడర్లకు నష్టాలు!
Zerodha down : ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జెరోధా సేవలకు గురువారం ఉదయం అంతరాయం ఏర్పడింది. యాప్లో ప్రైజ్లు సరిగ్గా టిక్ అవ్వడం లేదని పలువురు కస్టమర్లు వెల్లడించారు.
ఈ వ్యవహారంపై స్పందించిన జెరోధా బృందం.. సమస్యను పరిష్కరించింది. ఇప్పుడు జెరోధా సేవలు మునుపటిలాగే కొనసాగుతున్నాయి.
గురువారం ట్రేడింగ్ సెషన్ మొదలైన కొంత సేపటికే ప్రైజ్ విషయంలో సమస్యలు తలెత్తినట్టు తెలుస్తోంది. చాలా మంది జెరోధా కస్టమర్లు.. సామాజిక మాధ్యమాల్లో తమ అసంతృప్తిని వెల్లడించారు.
Zerodha not working : ఈ క్రమంలో.. జెరోధాపై సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ పేలాయి. 'జెరోధా టీమ్ కూడా.. సెలవుల మీద వెళ్లినట్టుంది,' అంటూ పలువురు ఫన్నీ కామెంట్లు పెట్టారు.
మరికొందరు.. జెరోధాపై తీవ్రంగా మండిపడ్డారు. 'జెరోధాలో టెక్నికల్ సమస్యల వల్ల.. నేను మూడోసారి లాస్ని బుక్ చేశాను. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?' అని ఓ ట్రేడర్ అసంతృప్తిని బయటపెట్టాడు. 'ఇప్పటికే నా 60 నిమిషాల సమయం వృథా అయిపోయింది. ఇకనైనా నా షేర్లను అమ్మగలనా?' అంటూ మరో వ్యక్తి ట్వీట్ చేశాడు.
పేటీఎం.. గూగుల్..
ఆన్లైన్ యాప్లు సరిగ్గా పనిచేయకపోవడం ఇటీవలి కాలంలో ఆందోళకర రీతిలో పెరుగుతోంది. పేటీఎం, గూగుల్ సేవలు సైతం ఇటీవల నిలిచిపోయాయి.
దేశవ్యాప్తంగా పేటీఎం సేవలకు గత శుక్రవారం అంతరాయం ఏర్పడింది. చాలా మందికి పేటీఎం యాప్ పనిచేయలేదు. పేటీఎం ద్వారా లావాదేవీలు జరగడం లేదని ఫిర్యాదు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై , బెంగళూరు వంటి నగరాల్లో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. పేటీఎంలో తలెత్తిన సమస్యలను కొంతసేపటికి సంస్థ పరిష్కరించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు యాప్ ఎప్పటిలాగానే పనిచేస్తోంది. వినియోగదారులు లావాదేవీలు చేసుకోగలుగుతున్నారు.