Minors stab man to death : 21ఏళ్ల వ్యక్తి దారుణ హత్య.. ఆ ఐదుగురు మైనర్ల పనే!
10 August 2022, 6:46 IST
Minors stab man to death : 21ఏళ్ల వ్యక్తిని ఐదుగురు మైనర్లు కత్తితో పొడిచి చంపేసిన ఘటన ఢిల్లీలో కలకలం సృష్టించింది. ప్రస్తుతం ముగ్గురు పోలీసుల అదుపులో ఉన్నారు.
21ఏళ్ల వ్యక్తి దారుణ హత్య.. ఆ ఐదుగురు మైనర్ల పనే!
Minors stab man to death : ఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 21ఏళ్ల వ్యక్తిని.. ఐదుగురు మైనర్లు కత్తితో పొడిచి చంపేశారు!
ఢిల్లీలోని మయూర్ విహార్ ప్రాంతంలో సోమవారం జరిగింది ఈ ఘటన. 16 బ్లాక్ త్రిలోక్పురి ప్రాంతంలో.. కత్తి పోట్లతో నేల మీద ఓ వ్యక్తి పడిపోయి ఉన్నాడని.. పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు.. తీవ్రంగా గాయపడిన 21ఏళ్ల వ్యక్తిని ఆసుపత్రికి తీసుకొచ్చారు. కానీ అప్పటికే అతడు మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు.
ఆ 21ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు మార్చ్యురీలో పెట్టారు.
మరోవైపు ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. క్రైమ్ సీన్కు వెళ్లి అన్నింటిని క్షుణ్నంగా పరిశీలించారు. ఘటనపై సెక్షన్ 302, ఐపీసీ 34 కింద కేసు నమోదు చేసుకున్నారు.
Delhi crime news : దర్యాప్తులో భాగంగా స్థానిక సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఐదుగురు వ్యక్తులు.. ఆ 21ఏళ్ల వ్యక్తిని దారుణంగా పొడిచి చంపుతున్న దృశ్యాలు అందులో రికార్డు అయ్యాయి. వారందరు మైనర్లే కావడం గమనార్హం.
తొలుత వారు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కొద్దిసేపటికే.. కత్తితో బాధితుడిని పొడిచి చంపేశారు.
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా.. ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా.. బాధితుడికి, నిందితులకు ఎప్పటి నుంచే సంబంధం ఉందని తెలిసింది. ఒక విషయంపై మొదలైన గొడవ, చివరికి ఒకరి ప్రాణాలు తీసిందని స్పష్టమైంది.
పోలీసులు.. మరో ఇద్దరిని పట్టుకునే పనిలో ఉన్నారు.
ప్రియుడి మృతదేహాన్ని బ్యాగులో కుక్కి..
దేశంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఉత్తర్ప్రదేశ్లో.. సహజీవనం చేస్తున్న వ్యక్తి గొంతును బ్లేడ్తో కోసేసింది ఓ మహిళ. అనంతరం ట్రాలీలో మృతదేహాన్ని కుక్కి.. వేరే ప్రాంతంలో విసిరిసేందుకు ప్రయత్నించింది. అప్పుడే పోలీసులకు దొరికిపోయింది.
ప్రీతి శర్మ అనే మహిళ.. నాలుగేళ్ల క్రితం తన భర్తతో విడిపోయింది. అప్పటి నుంచి ఫిరోజ్ అనే వ్యక్తితో సహజీవనంలో ఉంది. అతని వయస్సు 23ఏళ్లు.
కొంత కాలంగా.. తనని పెళ్లి చేసుకోవాలని ప్రీతి.. ఫిరోజ్ను అడుగుతోంది. ఏవేవో సాకులు చెబుతూ.. అతను తప్పించుకున్నాడు.
ఆదివారం రాత్రి వారి మధ్య గొడవ జరిగింది. తనని పెళ్లి చేసుకోవాలని ప్రీతి.. మరోమారు ఫిరోజ్ను డిమాండ్ చేసింది. వేరే మతానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి తన కుటుంబసభ్యులు ఒప్పుకోరని చెప్పాడు ఫిరోజ్. ప్రీతిని పెళ్లి చేసుకోలేనని తేల్చేశాడు.
ఈ క్రమంలో కోపం పెంచుకున్న ప్రీతి.. క్షణికావేశంలో ఫిరోజ్ను చంపేసింది. బ్లేడ్తో అతని గొంతు కోసేసింది. ఆ తర్వాత.. మృతదేహాన్ని ఓ పెద్ద ట్రాలీ బ్యాగులో కుక్కింది.
Ghaziabad crime news : ఘాజియాబాద్ రైల్వే స్టేషన్లో ట్రాలీని పడేసేందుకు బయలు దేరింది ప్రీతి. కానీ అప్పుడే రోడ్డు మీద ఓ పోలీసు వాహనం ఎదురైంది.
ట్రాలీని, ప్రీతిని మహిళా పోలీసు సిబ్బంది తనిఖీ చేశారు. అప్పుడే ట్రాలీలో నుంచి ఓ మృతదేహం బయటపడింది.
విచారణలో భాగంగా.. ప్రీతిని పోలీసులు ప్రశ్నించారు. అప్పుడే అసలు విషయం బయటపడింది. పెళ్లికి నిరాకరించడంతోనే సహజీవనం చేస్తున్న వ్యక్తిని చంపేసినట్టు ఆ మహిళ అంగీకరించింది. హత్యకు ఉపయోగించిన బ్లేడ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.