Advocate Murder : ములుగులో న్యాయవాది దారుణ హత్య….
02 August 2022, 11:39 IST
- తెలంగాణలోని ములుగు జిల్లాలో న్యాయవాదిని దారుణంగా హత్య చేశారు. భూ వివాదాల నేపథ్యంలో హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు. న్యాయవాది కారును వెనక నుంచి ఢీకొట్టి పథకం ప్రకారం హత్య చేశారు.
ములుగులో న్యాయవాది దారుణ హత్య
భూ వివాదాల నేపథ్యంలో ములుగుకు చెందిన సీనియర్ న్యాయవాది మూలగుండ్ల మల్లారెడ్డిని దారుణంగా హతమార్చారు. భూ సమస్యలకు సంబంధించి ములుగులోని కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన న్యాయవాది పని పూర్తైన తర్వాత సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో హనుమ కొండకు బయలుదేరారు. ములుగు మండలంలోని పందికుంట బస్ స్టాపు సమీపంలో స్పీడ్బ్రేకర్లు ఉండడంతో మల్లారెడ్డి తన వాహనాన్ని స్లో చేశారు.
అదే సమయంలో వెనక నుంచి కారులో ఆయనను అనుసరిస్తూ వస్తున్న నిందితులు న్యాయవాది కారును ఢీకొట్టారు. దీంతో వాహనం ఆపి కిందికి దిగిన మల్లారెడ్డి కారును ఢీకొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నిందితుల్లో ఓ వ్యక్తి వచ్చి కావాలని ఢీకొట్టలేదని, క్షమించాలని కోరడంతో మల్లారెడ్డి శాంతించి తిరిగి కారులో కూర్చున్నారు. న్యాయవాది తిరిగి కార్లోకి ఎక్కి తలుపు వేసుకుంటున్న సమయంలో మరి కొందరు వ్యక్తులు మల్లారెడ్డిని కిందికి లాగి దాడి చేశారు. సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి కత్తులతో పొడిచి హత్య చేశారు.
హత్య చేసే సమయంలో ఇద్దరు వ్యక్తులు కారు డ్రైవర్ను కదలకుండా పట్టుకున్నారు. మల్లారెడ్డి చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న ములుగు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
మల్లారెడ్డికి ములుగు మండలంలోని మల్లంపల్లిలో వ్యవసాయ భూములతోపాటు ఎర్రమట్టి క్వారీ, పెట్రోలు బంకు వ్యాపారాలున్నాయి. వ్యవసాయ భూములకు సంబంధించిన కేసులు కోర్టుల్లో ఉన్నాయి. మల్లారెడ్డి హత్యకు ఈ భూ సమస్యలే కారణమని అనుమానిస్తున్నారు. ఆయన కదలికలను పసిగట్టి పక్కా ప్రణాళికతోనే నిందితులు ఆయనను హత్య చేశారని చెబుతున్నారు. మల్లారెడ్డి స్వస్థలం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ. భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి కొంత కాలంగా హనుమకొండలో ఉంటున్నారు
టాపిక్