Wife Killed : ప్రేమ, పెళ్లి, హత్య…. చిత్తూరులో తమిళ యువతి హత్య
01 August 2022, 7:27 IST
- ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను నెలల వ్యవధిలోనే దారుణంగా హత్య చేశాడు. గంజాయి మత్తులో భార్యను కత్తితో పొడిచి శవాన్ని అడవిలో వదిలేశాడు. దాదాపు నెల రోజుల తర్వాత మృతదేహం పోలీసులకు లభ్యమైంది.
భర్త చేతిలో హత్యకు గురైన తమిళ సెల్వి
ప్రేమించాడు, పెళ్లాడాడు, ఆపై భార్యపై అనుమానం పెంచుకున్నాడు. బయటకు తీసుకువెళ్లి దారుణంగా హత్య చేశాడు. చిత్తూరు జిల్లా నారాయణ వనంలో ఈ దారుణం వెలుగు చూసింది. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా రెడ్హిల్స్ ప్రాంతానికి చెందిన మదన్, తమిళసెల్విలు మూడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. భార్యపై అనుమానం పెంచుకన్న మదన్ పెళ్లైన కొద్ది రోజులకే ఆమెను వేధించడం ప్రారంభించాడు. మద్యం, గంజాయిలకు బానిసైన మదన్ భార్యను అనుమానంతో హింసించేవాడు. కట్నం తీసుకురాలేదని ఆమెను వేధించేవాడు.
ఈ క్రమంలో జూన్ 25న తమిళసెల్వితో కలిసి నిందితుడు కైలాసకోనకు వచ్చాడు. కొండపై ఉన్న అటవీ ప్రాంతంలో భార్యను కత్తితో పొడిచి హత్య చేసి పారిపోయాడు. తమ కుమార్తె కనిపించడం లేదని తమిళ సెల్వి తల్లిదండ్రులు మణ్గండన్, పల్గీసీలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన తిరువళ్లూరు పోలీసులు మదన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
తొలుత తనకేమి తెలియదని బుకాయించిన మదన్ ఆ తర్వాత పోలీసులకు నిజం చెప్పేశాడు. గంజాయి మత్తులో భార్యను హతమార్చినట్లు అంగీకరించాడు. జూన్లో 25న భార్యతో కలిసి కొండపైకి వెళ్లానని ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో కోపంతో భార్యను కత్తితో పొడిచి చంపేసినట్లు అంగీకరించాడు. మృతదేహాన్ని కొండపైనే వదిలేసి వచ్చేసినట్లు చెప్పాడు. కత్తి పోట్లకు గాయపడిన తమిళ సెల్విని కొండపైనే వదిలేసి రావడంతో చనిపోయి ఉంటుందని చెప్పాడు. ప్రేమ పేరుతో వెంటపడి పెళ్లి చేసుకుని చివరకి మూడు నెలల్లోనే దారుణంగా హత్య చేయడంపై ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
తమిళ సెల్విపై దాడి చేసిన సమయంలో గంజాయి మత్తులో ఉండటంతో ఎక్కడ హత్య జరిగిందో గుర్తు లేదని నిందితుడు పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులుు కైలాస కోనం కొండపై గత కొన్ని రోజులుగా గాలింపు చేపట్టారు. తమిళనాడు నుంచి వచ్చిన ప్రత్యేక పోలీసు బృందాలు మృతదేహం కోసం కొండపై గాలింపు చేపట్టాయి. నెలరోజుల తర్వాత ఆదివారం కొండపైన అటవీ ప్రాంతంలో మృతురాలి దుస్తులు, పాదరక్షలు, మెట్టెల్ని గుర్తించారు. శవం పూర్తిగా కుళ్లిపోవడంతో ఘటనా స్థలంలోనే పంచనామా నిర్వహించారు. నిందితుడు మదన్ ఇప్పటికే తిరువళ్లూరు పోలీసుల అదుపులో ఉన్నాడు.
టాపిక్