Rashtrapatni row : రాష్ట్రపతిని గౌరవించలేదని స్మృతి ఇరానీపై అధీర్ ఫిర్యాదు
30 July 2022, 8:42 IST
Rashtrapatni row : బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీపై లోక్సభ స్పీకర్కు కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతికి ఆమె గౌరవం ఇవ్వలేదని ఆరోపించారు.
రాష్ట్రపతిని గౌరవించలేదని స్మృతి ఇరానీపై అధీర్ ఫిర్యాదు
Rashtrapatni row : పార్లమెంట్లో ‘రాష్ట్రపతి’ చుట్టూ అలుముకున్న వివాదం ఇప్పట్లో ముగిసేడట్టు కనిపించడం లేదు. ఇన్నిరోజులు.. కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్పై అధికారపక్షం మండిపడితే.. ఇప్పుడు అందుకు ఆయన రివేంజ్ తీర్చుకుంటున్నట్టు కనిపిస్తోంది. బీజేపీ మహిళా ఎంపీ స్మృతి ఇరానీకి వ్యతిరేకంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు అధీర్ రంజన్ చౌధరి. రాష్ట్రపతికి ఆమె గౌరవం ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
"శ్రీమతి స్మృతి ఇరానీ.. రాష్ట్రపతి గురించి సభలో ప్రస్తావించారు. ఆ సమయంలో ఆమె రాష్ట్రపతికి గౌరవం ఇవ్వలేదు. మేడం/శ్రీ అని సంబోధించకుండానే అనేకమార్లు రాష్ట్రపతి పేరును ప్రస్తావించారు. 'ద్రౌపది ముర్ము.. ద్రౌపది ముర్ము' అని ఆమె అనేకమార్లు అరిచారు. ఇది రాష్ట్రపతిని, రాష్ట్రపతి కార్యాలయాన్ని కించపరిచినట్టే. ఆమె ప్రసంగాన్ని సభ కార్యకలాపాల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నా," అని తన ఫిర్యాదులో అధీర్ రంజన్ వివరించారు.
ఈ వ్యవహారంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి సంబంధం లేదని, అందువల్ల ఆమె చుట్టు జరిగిన పరిణామాలను కూడా సభ కార్యకలాపాల నుంచి తొలగించాలని ఓం బిర్లాకు అధీర్ రంజన్ విజ్ఞప్తి చేశారు.
ఇదీ వివాదం..
Adhir Ranjan : రాష్ట్రపతి ద్రౌపది ముర్మును 'రాష్ట్రపత్ని' అని సంబోధించారు అధీర్ రంజన్ చౌదరి. తప్పుగా ఆ పదం దొర్లిందని, అవసరమైతే.. ద్రౌపదికి తాను క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమని ఆయన వెల్లడించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది! బీజేపీకి.. ఆయన మరో అవకాశం ఇచ్చేశారు.
ఈ పరిణామాలతో లోక్సభ అట్టుడికింది. అధీర్ రంజన్తో పాటు సోనియా గాంధీ కూడా క్షమాపణలు చెప్పాలని బీజేపీ మహిళా ఎంపీలు డిమాండ్ చేశారు. గురువారం.. సోనియా గాంధీ సైతం ఇబ్బంది పడాల్సి వచ్చింది. అధీర్ రంజన్ చౌదరి మాటలకు సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలని బీజేపీ మహిళా ఎంపీలు పట్టుబట్టారు. 'నేను ఎందుకు సారీ చెప్పాలి?' అని సోనియా అడిగితే.. 'అధీర్ రంజన్ను కాంగ్రెస్ సభా పక్షనేతగా ఎన్నుకోవడమే మీరు చేసిన తప్పు. అందుకే క్షమాపణలు చెప్పాలి,' అని బీజేపీ మహిళా ఎంపీలు తేల్చిచెప్పారు.
చివరికి.. తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతున్నట్టు.. రాష్ట్రపతి ముర్ముకు లేఖ రాశారు.