Rashtrapatni row | `ఐ యామ్ సారీ రాష్ట్రపతి గారూ`
Rashtrapatni row | రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ ఆధిర్ రంజన్ చౌధురి విచారం వ్యక్తం చేశారు. నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును `రాష్ట్రపత్ని` అంటూ ఆధిర్ రంజన్ చౌధురి చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారం చెలరేగిన విషయం తెలిసిందే.
'Rashtrapatni' row | ఈ అంశం కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యలను పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ బాధ్యత తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. తక్షణమే రాష్ట్రపతికి సోనియాగాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.
'Rashtrapatni' row | లిఖితపూర్వక క్షమాపణ
తన వ్యాఖ్యలు కావాలని చేసినవి కావని కాంగ్రెస్ ఎంపీ ఆధిర్ రంజన్ చౌధురి ఇప్పటికే వివరణ ఇచ్చారు. రాష్ట్రపతికి క్షమాపణ చెప్పడానికి సిద్ధమేనన్నారు. ``నా వ్యాఖ్యలతో రాష్ట్రపతి బాధపడితే స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి 100 సార్లు క్షమాపణ చెప్తాను. కానీ ఈ బీజేపీ వాళ్లకు మాత్రం సారీ చెప్పే ప్రసక్తే లేదు`` అని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆధిర్ రంజన్ చౌధురి ఒక లేఖ రాశారు. అందులో ఆమెపై తాను చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. అవి పొరపాటున చేసిన వ్యాఖ్యలని, అయినా క్షమాపణలు చెబుతున్నానని వివరించారు. ``పొరపాటున మీ హోదాకు సంబంధించి తప్పుడు పదం వాడాను. అందుకు ఎంతో బాధ పడుతున్నాను. విచారం వ్యక్తం చేస్తున్నాను. నా క్షమాపణలను స్వీకరించాలని కోరుతున్నాను`` అని ఆ లేఖలో ఆధిర్ రంజన్ చౌధురి పేర్కొన్నారు.
'Rashtrapatni' row | సోనియా, ఇరానీ వివాదం
రాష్ట్రపతిపై కాంగ్రెస్ ఎంపీ ఆధిర్ రంజన్ చౌధురి చేసిన వ్యాఖ్యలతో గురువారం పార్లమెంటు అట్టుడికింది. ఎంపీ ఆధిర్ రంజన్ చౌధురితో పాటు కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ కూడా రాష్ట్రపతి ముర్ముకు క్షమాపణ చెప్పాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. ఆ సమయంలో బీజేపీ సభ్యురాలు రమాదేవి వద్దకు వెళ్లిన సోనియా.. ఈ వివాదంలో తన పేరు ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. ఈ సమయంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ జోక్యం చేసుకుంది. దాంతో, సోనియా గట్టిగా `డోంట్ టాక్ టు మి` అంటూ స్మృతి ఇరానీపై మండిపడ్డారు.