Adhir Ranjan Chowdhury : వివాదాలకు కేరాఫ్​ అడ్రస్​.. 'అధీర్​ రంజన్​'!-rashtrapatni row a look at adhir ranjan chowdhurys past controversial statements ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Rashtrapatni Row A Look At Adhir Ranjan Chowdhurys Past Controversial Statements

Adhir Ranjan Chowdhury : వివాదాలకు కేరాఫ్​ అడ్రస్​.. 'అధీర్​ రంజన్​'!

Sharath Chitturi HT Telugu
Jul 29, 2022 11:39 AM IST

Adhir Ranjan Chowdhury : 'రాష్ట్రపత్ని' వ్యాఖ్యలతో మరోమారు వివాదంలో చిక్కుకున్నారు కాంగ్రెస్​ ఎంపీ అధీర్​ రంజన్​ చౌదరి. అయితే.. ఆయనకు వివాదాలు కొత్తేమీ కాదు. అనేకమార్లు ఆయన వార్తల్లో నిలిచారు.

అధీర్​ రంజన్​ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసనలు
అధీర్​ రంజన్​ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసనలు (PTI)

Adhir Ranjan Chowdhury : అధీర రంజన్​ చౌదరి.. ఇప్పుడు ఈ పేరు పార్లమెంట్​లో మారుమోగిపోతోంది. నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు.. ఇప్పుడు అధికారపక్షానికి అస్త్రంగా మారింది. నిన్న, మొన్నటి వరకు.. పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల్లో విపక్షాలు నిరసన చేస్తే.. ఇక ఇప్పుడు అధీర రంజన్​ వ్యవహారాన్ని పట్టుకుని అధికారపక్షమే ఆందోళనకు దిగుతోంది. అయితే.. ఈ కాంగ్రెస్​ సీనియర్​ ఎంపీ.. వివాదాల్లో చిక్కుకోవడం ఇది కొత్తేమీ కాదు. ఇప్పటికే అనేకమార్లు.. ఆయన మాటలు అనేకమార్లు వివాదాలకు దారితీశాయి.

2019లో రాష్ట్రపతి ప్రసంగానికి ధ్యనవాద తీర్మానం చేస్తుండగా.. ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అధీర్​ రంజన్​ చౌదరి. ' కహా మా గంగా, కహా గంధీ నాలి'(తల్లి గంగా నది ఎక్కడ.. మురికి నీటిలో పురుగులెక్కడ?) అని ఇందిరా గాంధీని మోదీతో పోల్చారు. ఈ వ్యవహారంపై బీజేపీలో నిరసనలు భగ్గుమన్నాయి. 125కోట్ల మంది ఎన్నుకున్న ప్రధానిని ఇంత మాట అంటారా? అని విరుచుకుపడింది. దీనిపై స్పందించిన అధీర్​.. 'నా హిందీ అంత సరిగ్గా ఉండదు. నా ఉద్దేశంలో నాలి అంటే.. నదీ ప్రవాహం' అని వివరణ ఇచ్చుకున్నారు.

Rashtrapatni row : 2019 శీతాకాల సమావేశాల్లో.. నిర్మలా సీతారామన్​పైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఈ బహరంపూర్​ ఎంపీ. నిర్మలను 'నిర్భల' అని అన్నారు. నిర్భల అంటే.. బలహీనం! ఈ వ్యవహారంపై సీతారామన్​ ఘాటుగానే స్పందించారు. 'నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మహిళలు బలహీనులు కారు.. సబలలు(శక్తివంతులు)' అంటూ బదులిచ్చారు.

2022 మే 21న.. మాజీ ప్రధాని రాజీవ్​ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని 'పెద్ద చెట్టే కూలిపోతే.. భూమి వణికిపోతుంది,' అంటూ ట్వీట్​ చేశారు అధీర్​ రంజన్​ చౌదరి. కొన్ని నిమిషాల్లోనే డిలీట్​ చేసేశారు. 1984లో ఇందిరా గాంధీ మరణం అనంతరం జరిగిన సిక్కు వ్యతిరేక మారణహోమం సమయంలో.. రాజీవ్​ గాంధీ ఈ వ్యాఖ్యలే చేశారు! అధీర్​ రంజన్​.. తన ట్వీట్​తో కాంగ్రెస్​ పరువు తీసేశారని బీజేపీ సెటైర్లు వేసింది. అయితే.. తన ట్విట్టర్​ హ్యాక్​ అయిందని, ఆ ట్వీట్​ తాను చేయలేదని అధీర్​ రంజన్​ చౌదరి ఆ తర్వాత హిందుస్థాన్​ టైమ్స్​కు చెప్పుకొచ్చారు.

Adhir Ranjan comment on Draupadi Murmu : ఇక తాజాగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును 'రాష్ట్రపత్ని' అని సంబోధించారు అధీర్​ రంజన్​ చౌదరి. తప్పుగా ఆ పదం దొర్లిందని, అవసరమైతే.. ద్రౌపదికి తాను క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమని ఆయన వెల్లడించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది! బీజేపీకి.. ఆయన మరో అవకాశం ఇచ్చేశారు.

బీజేపీ నుంచే కాదు.. సొంత పార్టీ సభ్యుల నుంచే కొన్ని సందర్భాల్లో వ్యతిరేకత ఎదుర్కొన్నారు అధీర్​ రంజన్​ చౌదరి. జీ23 సభ్యుల్లో ఒకరైన కపిల్​ సిబల్​ ఎవరో తనకు తెలియదంటూ వ్యాఖ్యానించారు. ఇది వివాదంగా మారింది.

అధీర్​ రంజన్​ వ్యవహారం కాంగ్రెస్​కు తలనొప్పిగా మారింది. గురువారం.. సోనియా గాంధీ సైతం ఇబ్బంది పడాల్సి వచ్చింది. అధీర్​ రంజన్​ చౌదరి మాటలకు సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలని బీజేపీ మహిళా ఎంపీలు పట్టుబట్టారు. 'నేను ఎందుకు సారీ చెప్పాలి?' అని సోనియా అడిగితే.. 'అధీర్​ రంజన్​ను కాంగ్రెస్​ సభా పక్షనేతగా ఎన్నుకోవడమే మీరు చేసిన తప్పు. అందుకే క్షమాపణలు చెప్పాలి,' అని బీజేపీ మహిళా ఎంపీలు తేల్చిచెప్పారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం