తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Eating Habits- Diabetes । తినేటపుడు చేసే ఈ తప్పులే, షుగర్ వ్యాధికి కారణం అవుతాయి!

Eating Habits- Diabetes । తినేటపుడు చేసే ఈ తప్పులే, షుగర్ వ్యాధికి కారణం అవుతాయి!

HT Telugu Desk HT Telugu

24 May 2023, 14:57 IST

    • Eating Habits- Diabetes: ఆహారం తినే విషయంలో మనకు తెలియకుండా చేసే పొరపాట్ల వలన మధుమేహం వచ్చే అవకాశం పెరుగుతుంది. తినే తిండి విషయంలో చేసే తప్పుల గురించి ఇక్కడ తెలుసుకోండి.
Eating Habits- Diabetes
Eating Habits- Diabetes (istock)

Eating Habits- Diabetes

Eating Habits- Diabetes: మధుమేహం అనేది మీరు తిన్న ఆహారం శక్తిగా మారకుండా ప్రభావితం చేసే ఒక దీర్ఘకాలిక అనారోగ్యం. షుగర్ వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే అది ఎప్పటికీ నయం కాదు, కాబట్టి మధుమేహం వచ్చిన తర్వాత ఇబ్బంది పడేకంటే ముందస్తు నివారణ ముఖ్యం.ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం, సరైన రీతిలో ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని నివారించవచ్చని మనందరికీ తెలుసు, కానీ ఆహారం తినే విషయంలో మనకు తెలియకుండా చేసే పొరపాట్ల వలన మధుమేహం వచ్చే అవకాశం పెరుగుతుంది.

ఆకలి లేకున్నా తినడం, అతిగా తినడం, విపరీతంగా విందులు చేసుకోవడం, స్వీట్స్ ఎక్కువగా తినడం ఇవన్నీ కాలక్రమేణా మధుమేహానికి దారితీస్తాయి. ప్యాంక్రియాస్ ఇన్సులిన్‌ను తయారు చేయలేనప్పుడు లేదా శరీరం ఉత్పత్తి చేసే ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించలేనప్పుడు ఇది సంభవిస్తుంది. జీవనశైలిలో సాధారణ మార్పులు చేసుకోవడం మధుమేహం విషయంలో గొప్ప మార్పును కలిగిస్తుంది.

ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ దీక్షా భావ్‌సర్ మధుమేహం రావడానికి, తినే తిండి విషయంలో చేసే తప్పుల గురించి తెలియజేసింది. అవి ఈ కింద చూడండి

రోజూ పెరుగు తినడం

పెరుగు ఆరోగ్యకరమైన ప్రోబయోటిక్ ఆహారంగా పరిగణిస్తారు. చాలామంది తమ రోజూవారీ ఆహారంలో తప్పకుండా పెరుగును తింటారు. అయితే ఆయుర్వేదం ప్రతిరోజూ పెరుగుని తినమని సిఫారసు చేయడం లేదని డాక్టర్ దీక్ష పేర్కొంది. రోజూ పెరుగు తినడం వల్ల బరువు పెరుగటం, వాపులు రావడంతో పాటు జీవక్రియ బలహీనపడుతుందని ఇది కూడా మధుమేహానికి దారితీయవచ్చునని పేర్కొన్నారు.

భారీగా విందులు

మనలో చాలా మంది రాత్రిపూట ఆలస్యంగా తినడం చేస్తారు, అర్ధరాత్రి వరకు విందులు చేసుకునే వారు ఉంటారు. జీర్ణవ్యవస్థ విశ్రాంతికి సమయం ఇవ్వడం లేదు. రాత్రి అతిగా తినడం, భారీగా విందులు చేసుకోవడం వలన కాలేయంపై ఎక్కువ భారం పడుతుంది. ఇది జీవక్రియను నెమ్మదింపజేస్తుందని, చివరికి పోషకాహార లోపం, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు.

అతిగా తినడం

చాలా సార్లు మనకు ఆకలి లేకపోయినా, కడుపు నిండినప్పటికీ కూడా ఇంకా తినాల్సిందిగా బలవంతం చేసే సందర్భాలు ఉన్నాయి. అయితే ఇలా ఆకలి లేకపోయినా తినడం లేదా సామర్థ్యం కంటే ఎక్కువ తినడం ఊబకాయం, కొలెస్ట్రాల్, జీర్ణ సమస్యలకు దారితీస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

ఆకలి లేకుండా తినడం

మీరు మీ శరీర సంకేతాలను పట్టించుకోకుండా తినడం అలవాటు చేసుకుంటే, ఇబ్బందుల్లో పడతారు. ప్రతి కొన్ని గంటలకొకసారి అదేపనిగా ఏదో ఒకటి తినడం వల్ల దీర్ఘకాలికంగా నష్టం జరగవచ్చు. ఆకలి లేకుండా తినడం లేదా ప్రతి గంట లేదా రెండు గంటలకు తినడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గి మధుమేహానికి దారితీస్తుంది.

ప్రీ-డయాబెటిస్, డయాబెటిస్‌ను మీకు వీలైనంత దూరంగా ఉంచడానికి ఈ అలవాట్లను మానుకోండి. ముఖ్యంగా వంశపారంపర్యంగా మధుమేహం ఉన్నవారికి ఈ అలవాట్లు ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గించగలవు, జీవక్రియ, పోషకాహార శోషణను భంగపరుస్తాయి, ప్రేగులలో మంటను పెంచుతాయి అని డాక్టర్ దీక్ష పేర్కొన్నారు.