Telangana Politics: సీఎం కేసీఆర్తో జగ్గారెడ్డి భేటీ - అసలేం జరుగుతోంది..?
09 February 2023, 19:29 IST
- Telangana Politics: ముఖ్యమంత్రి కేసీఆర్ తో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ అయ్యారు. నియోజకవర్గ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ పరిణామం రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
MLA Jagga Reddy Meets CM KCR: తెలంగాణ కాంగ్రెస్.... నిత్యం ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంది. ప్రభుత్వంలో ఉన్నా... ప్రతిపక్షంలో ఉన్నా... ఆ పార్టీలోని నేతల తీరే వేరుగా ఉంటుంది. నేతల మధ్య డైలాగ్ లు కూడా భారీగానే పేలుతూనే ఉంటాయి. ఓ నేత ఒకలా మాట్లాడితే... మరో నేత మరోలా మాట్లాడటం చూస్తుంటాం. ఈ మధ్య కాలంలో విషయం కాస్త సీనియర్లు... జూనియర్లు అనే వరకు కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సమస్య కాస్త సద్దుమణిగినప్పటికీ ప్రస్తుతం కూడా ఆసక్తికర పరిణామాలు కనిపిస్తున్నాయి. ఓ వైపు రేవంత్ రెడ్డి పాదయాత్ర సీనియర్లు రాకపోవటం కూడా... పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగానే... పార్టీలోని సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి... సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఇదీ కాస్త హస్తం పార్టీలోనే కాదు.. రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
అసెంబ్లీ వేదికగా భేటీ...
అసెంబ్లీ హాల్ వేదికగా సీఎం కేసీఆర్ తో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గురువారం భేటీ అయ్యారు. నియోజకవర్గంలో అభివృద్ది పనులపై కేసీఆర్ తో చర్చించినట్టుగా జగ్గారెడ్డి చెప్పారు. సంగారెడ్డికి మెట్రో రైలును పొడిగించాలని కోరినట్టుగా వెల్లడించారు. పైగా ముఖ్యమంత్రిని కలవటాన్ని కూడా ఆయన సమర్థించుకున్నారు. ప్రధాని మోదీని కాంగ్రెస్ ఎంపీలు కలిస్తే తప్పు లేనిది తాను సీఎంను కలిస్తే తప్పుందా అని సూటిగా ప్రశ్నించారు. ప్రధానిని కూడా నేరుగానే కాదు... చాటుగా కూడా కలుస్తున్నారని వ్యాఖ్యానించారు.
తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా కొన్ని అంశాల విషయంలో జగ్గారెడ్డి ప్రశంసలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని.. చెప్పిన పని చేసిందంటూ కొనియాడారు. మెడికల్ కాలేజీల ఏర్పాటు గురించి మాట్లాడిన ఆయన… తన నియోజకవర్గంలో మెడికల్ కాలేజీని కేసీఆర్ సర్కార్ నిర్మించిందన్నారు. చెప్పినట్టుగానే మెడికల్ కాలేజీ నిర్మించి.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ప్రశంసించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు కూడా చెప్పారు. "మెడికల్ కాలేజీల నిర్మాణం గురించి కేంద్ర ప్రభుత్వం చాలా నరికింది కానీ.. ఏం చేసింది లేదు. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చెప్పినట్టుగానే కాలేజీని నిర్మించిందని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో పలు అంశాల విషయంలో ప్రభుత్వం జాప్యం వహిస్తోందని కూడా విమర్శించారు. ఇదే కాదు… గతంలో కూడా జగ్గారెడ్డిపై అనేక వార్తలు వచ్చాయి. బీఆర్ఎస్ లోకి వెళ్తారంటూ జోరుగా చర్చ జరిగింది. అయితే ఈ వార్తలను జగ్గారెడ్డి కొట్టిపారేశారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగతనని స్పష్టం చేశారు.