Telangana Liberation Day: కేంద్రం నుంచి ఆహ్వానం.. కేసీఆర్ ఏం చేయబోతున్నారు..?
03 September 2022, 16:18 IST
- telangana liberation day celebrations 2022: తెలంగాణ విమోచన దినోత్సవం చుట్టూ.. ఎప్పుడూ లేనంత రచ్చ జరుగుతోంది. తెలంగాణ విమోచన దినోత్సవాన్నిఅధికారికంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అంతేనా మూడు రాష్ట్రాల సీఎంలకు లేఖ రాసింది. ఇందులో కేసీఆర్ కూడా ఉన్నారు.
సీఎం కేసీఆర్ కు కేంద్రం ఆహ్వానం
telangana liberation day celebrations: తెలంగాణ విమోచన దినోత్సవం... ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ... మరో మాస్టర్ ప్లాన్ తో రంగంలోకి దిగింది. ఇప్పటికే బీజేపీ, టీఆర్ఎస్ మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం జరుగుతున్న వేళ.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని (Telangana Liberation Day) అధికారికంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఫలితంగా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వార్... మరింత పీక్స్ కి చేరినట్లు అయింది.
కేసీఆర్ కు ఆహ్వానం...
centre invites cm kcr: ఇప్పటికే నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో తలపెట్టాలని చూస్తోంది. ఈ కార్యక్రమానికి అమిత్ షాతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర సీఎంలు వస్తారని స్పష్టం చేసింది. అయితే తాజాగా.... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా లేఖ రాసింది కేంద్ర సర్కార్. కేసీఆర్ను గెస్ట్ ఆఫ్ ఆనర్గా రావాలని ఆహ్వానించింది. ఏడాది పాటు రాష్ట్రమంతా తెలంగాణ విమోచన దినోత్సవాలు జరపాలని, ఇందులో కేంద్ర ప్రభుత్వం సైతం భాగస్వామ్యం అవుతుందని పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ విమోచనం తర్వాత కొన్ని జిల్లాలు కర్ణాటక, మహారాష్ట్రలో కలిశాయని, అందుకే మూడు రాష్ట్రాలకు దీనితో సంబంధం ఉందని వివరించారు.
BJP Vs TRS: సెప్టెంబర్ 17 విషయంలో ఇప్పటికే టీఆర్ఎస్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేస్తున్న బీజేపీ... తాము అధికారంలోకి వస్తే అధికారికంగా నిర్వహిస్తామని చెబుతూ వచ్చింది. అయితే రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై ఎప్పటికప్పుడూ అంచనా వేస్తూ ముందుకెళ్తున్న బీజేపీ.... కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టేందుకు సిద్ధం కావటం ఆసక్తికరంగా మారింది. అయితే కేసీఆర్ ను ఇందులో భాగస్వామ్యం చేయకుండానే నిర్వహిస్తారనే అంతా భావించినప్పటికీ... ఇలా ఆహ్వానం పంపటంతో రాష్ట్ర రాజకీయం ఇంట్రెస్టింగ్ మారింది.
అయితే బీజేపీ ఎత్తుకు పైఎత్తు వేయాలని భావిస్తున్నారు కేసీఆర్. తెలంగాణ విలీన వజ్రోత్సవాలను తలపెట్టాలని యోచిస్తున్నారు. ఏడాది పొడవునా జరిపేలా ప్లాన్ రచిస్తున్నారు. ఇవాళో రేపో నిర్ణయం తీసుకోవటం ఖాయంగానే కనిపిస్తోంది. ఇదే జరిగితే సెప్టెంబర్ 17 మంటలు...భారీగానే కాక రేపే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో బీజేపీ కాస్త దూకుడుగానే ముందుకెళ్లేలా కనిపిస్తోంది.
మొత్తంగా విమోచన అంశంతో కేసీఆర్ సర్కార్ ఉక్కిరిబిక్కిరి చేయాలని కమలనాథులు భావిస్తుంటే... కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది. నిజంగానే వజ్రోత్సవాల నిర్వహించి... బీజేపీకి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా చేస్తారా..? లేక ప్రతి ఏడాది లాగే నిర్వహించి... సైలెంట్ గా ఉంటారనేది చూడాలి..!
టాపిక్