BSP Telangana: ఆ భయంతోనే ఆయన నియామకం.. త్వరలోనే BRS అవినీతిని బయటపెడతా - RS ప్రవీణ్ కుమార్
21 May 2023, 7:25 IST
- BSP State Chief RS Praveen Kumar: బీఆర్ఎస్ సర్కార్ పై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రీబవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. త్వరలోనే బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి చిట్టాను బయటపెడతామని చెప్పారు.
బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar Fires On BRS Govt: త్వరలోనే బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిని త్వరలో బయటపెడతామని ప్రకటించారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే మంత్రివర్గ ఉపసంఘాలు ఏర్పాటు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను వచ్చే ఎన్నికల్లో గద్దెదించాలని పిలుపునిచ్చారు. శనివారం బీఎస్పీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన... రాష్ట్రంలో పోడు భూముల సమస్యలు,ధరణి పోర్టల్,ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ, అక్రమ లే అవుట్లు,ప్లాట్లు,గ్రామ కంఠం భూముల క్రమబద్ధీకరణకు వేసిన మంత్రివర్గ ఉపసంఘాలు సిఫార్సులను ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అర్హులైన ఆదివాసీ,గిరిజనులకు పోడు పట్టాలు ఇవ్వడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. రెవెన్యూ అధికారుల తప్పిదాల వల్ల ధరణి పోర్టల్ లో లక్షలాది ఎకరాల పేదల అసైండ్ భూములు నిషేధిత జాబితాలో నమోదయ్యాయని ఆరోపించారు. నిషేధిత జాబితాలో ఉన్న లక్షల ఎకరాల అసైన్డ్ భూములను వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
భూ రికార్డుల నమోదులో జరిగిన పొరపాట్లను సరిచేసేందుకు అనువైన మాడ్యూల్స్ ను త్వరగా అందుబాటులోకి తేవడంలో హరీష్ రావు మంత్రివర్గ ఉప సంఘం సిఫార్సులు బుట్ట దాఖలయ్యాయని విమర్శించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజులు నియంత్రణపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.హైదరాబాద్ మహానగరం చుట్టూ అక్రమ లే అవుట్లు,అక్రమ కట్టడాలపై, ప్రభుత్వ ఎందుకు చర్యలు తీసుకోలేదో ప్రజలకు తెలపాలన్నారు.గత రెండు దశబ్దాలుగా రియల్టర్ల చేతిలో హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న 3,000 చెరువులు ధ్వంసం అయ్యాయాని గుర్తు చేశారు. ల్యాండ్ పూలింగ్ పేరిట ప్రభుత్వం పేద ప్రజల దగ్గర నుండి వేల ఎకరాల భూములను గుంజుకొని కేవలం వంద గజాల ఇంటి స్థలాన్ని కేటాయించి పేదలకు పేదలను అన్యాయానికి గురిచేస్తుందని అన్నారు. ఫార్మా కంపెనీల కోసం ఆళ్లగడప,వెలిమినేడు లో ఇథనాల్ కంపెనీ కోసం వెలగటూరులో, అమరరాజా బ్యాటరీల కంపెనీ కోసం దివిటిపల్లి లో పేదల అసైండ్ భూములను బలవంతంగా లాక్కొని ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు మాత్రం విలువైన భూములు కేటాయించి,రాయితీలు కల్పిస్తున్నారని ఆక్షేపించారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ దళితులు, థర్డ్ క్లాస్ అని చేసిన వాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకొని, దళితులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల మీద దాడులు,పత్రికలు,టీవీల మీద నిషేధం విధించడాన్ని బీఎస్పీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల ముందు బీఎస్పీలో చేరేందుకు బీఆర్ఎస్,కాంగ్రెస్, బీజేపీల నాయకులు సిద్ధంగా ఉన్నారని అన్నారు.వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ అన్ని స్థానంలో పోటీ చేస్తుందని ప్రకటించారు.రెండు వేల రూపాయల నోట్ల రద్దుపై స్పందించిన ఆయన నోట్ల రద్దుతో.. కేవలం అక్రమంగా సంపాదించిన పారిశ్రామికవేత్తలు,రాజకీయ నేతలకే భయమని పేద ప్రజలకు ఒరిగేదిమి లేదని అన్నారు.బీఎస్పీ అధికారంలో కి వస్తే బెల్టు షాపులు పూర్తిగా రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. యాసంగి ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం ఎలక్షన్ గా వ్యవహరిస్తూ రైతులను తీరని అన్యాయానికి గురిచేస్తుందన్నారు.
కులవృత్తులు ఇప్పుడు గుర్తొచ్చాయా?
బీసీలలోని చేతివృత్తులు,కులవృత్తులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం చేస్తానని కేసీఆర్ ప్రకటించడం మభ్యపెట్టడమేని విమర్శించారు ప్రవీణ్ కుమార్.నాయి బ్రాహ్మణ, రజక కుల వృత్తిదారులకు సెలూన్,దోబీ ఘాట్ లు, లాండ్రీ దుకాణములు నడిపేందుకు గా 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఎందుకు అమలుకు నోచుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్, ఫెడరేషన్ల ద్వారా ఎంతమంది బీసీలకు రుణాలు మంజూరు చేశారో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు,అధికారుల అవినీతి బయటపడుతుందన్న భయంతోనే ముఖ్యమంత్రి కార్యాలయంలో మాజీ ఐఏఎస్ సోమేష్ కుమార్ ను ప్రధాన సలహాదరుడిగా నియమించుకున్నారని విమర్శించారు. త్వరలోనే బీఆర్ఎస్ నేతల అవినీతి చిట్టా ఆధారాలతో సహా బయటపెడుతానని అన్నారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై ఈడీ,సిట్ దర్యపు జరుగుతుండగానే ప్రస్తుత టీఎస్పీఎస్సీ బోర్డు పరీక్షల నిర్వహణకు ఏర్పాటు చేయడం వెనుక ప్రభుత్వ పెద్దల కుట్ర ఉందని ఆరోపించారు.