Naseem Shah Bat Auction: ఆ రెండు సిక్స్లు కొట్టిన బ్యాట్ను వేలం వేస్తున్న పాకిస్థాన్ స్టార్.. ఇదీ కారణం
15 September 2022, 17:30 IST
- Naseem Shah Bat Auction: ఆసియా కప్లో ఆ రెండు సిక్స్లు కొట్టిన బ్యాట్ను వేలం వేస్తున్నాడు పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ నసీమ్ షా. ఆఫ్ఘనిస్థాన్తో మ్యాచ్లో నసీమ్ కొట్టిన ఆ సిక్స్లే ఇండియాను ఫైనల్కు దూరం చేశాయి.
ఆఫ్ఘనిస్థాన్ తో మ్యాచ్ లో రెండు సిక్స్ లు కొట్టి పాకిస్థాన్ ను గెలిపించిన తర్వాత నసీమ్ షా సంబరాలు
Naseem Shah Bat Auction: ఆసియాకప్లో భాగంగా ఆఫ్ఘనిస్థాన్తో జరిగిన మ్యాచ్లో చివరి ఓవర్ తొలి రెండు బాల్స్ను సిక్స్లుగా మలచి పాకిస్థాన్ను గెలిపించాడు నసీమ్ షా. విజయం కోసం చివరి ఓవర్లో 11 రన్స్ అవసరం కాగా.. నసీమ్ రెండు వరుస సిక్సర్లతో మ్యాచ్ను ముగించాడు. ఈ రెండు సిక్సర్లు రెండు టీమ్స్ను అంటే ఆఫ్ఘనిస్థాన్, ఇండియాలను ఆసియా కప్ ఫైనల్కు దూరం చేశాయి.
ఇప్పుడా చారిత్రక విజయం సాధించి పెట్టిన తన బ్యాట్ను నసీమ్ షా వేలం వేయనున్నాడు. ఈ విషయాన్ని గురువారం (సెప్టెంబర్ 15) ఒక వీడియో ద్వారా నసీమ్ వెల్లడించాడు. ఈ వీడియోను తన ట్విటర్లో పోస్ట్ చేశాడు. షాహిద్ అఫ్రిది ఫౌండేషన్కు ఈ బ్యాట్ను ఇవ్వనున్నాడు. ఈ బ్యాట్ వేలం ద్వారా వచ్చే డబ్బును పాకిస్థాన్లో వరద సహాయక చర్యల కోసం వినియోగించనున్నట్లు నసీమ్ చెప్పాడు.
ఈ బ్యాట్ తనకెంతో ప్రత్యేకమైందైనా.. ఓ మంచి పని కోసం దీనిని వేలానికి ఇవ్వనున్నట్లు ఆ వీడియోలో నసీమ్ తెలిపాడు. నిజానికి ఈ బ్యాట్ నసీమ్ది కూడా కాదు. ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్లో బ్యాటింగ్ చేయడం కోసం సహచర పేస్ బౌలర్ హస్నైన్ తన బ్యాట్ను నసీమ్కు ఇచ్చాడు. ఆ బ్యాట్ అతనికి కలిసొచ్చి దాంతోనే రెండు సిక్స్లు బాది పాకిస్థాన్ను ఫైనల్ చేర్చాడు నసీమ్ షా.
"ఈ బ్యాట్ నాకెంతో విలువైనది. కానీ పాకిస్థాన్లో వరద పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని దీనిని షాహిద్ అఫ్రిది ఫౌండేషన్కు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే అఫ్రిది ఎప్పుడూ కష్టాల్లో ఉన్న వారికి సాయం చేస్తూనే ఉంటాడు" అని నసీమ్ ఆ వీడియోలో చెప్పాడు. తన సొంతూర్లో వరదల వల్ల ప్రభావితమైన వారిని కూడా ఆదుకోవాలని అఫ్రిదిని కోరాడు.
నసీమ్ షా తన తర్వాతి సిరీస్లో ఇంగ్లండ్తో ఆడనున్నాడు. సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభం కానున్న ఏడు టీ20ల సిరీస్ కోసం ఇంగ్లండ్ టీమ్ గురువారం (సెప్టెంబర్ 15) పాకిస్థాన్లోని కరాచీలో అడుగుపెట్టింది. మరోవైపు పాకిస్థాన్ను కొంతకాలంగా వరదలు అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఈ వరదల్లో ఇప్పటి వరకూ 1500 మంది చనిపోయారు. ఈ వరదల వల్ల పాకిస్థాన్లోని 3.3 కోట్ల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.