KS Bharat on Indian Pitches: ఇండియన్ పిచ్లపై ఇలా ఆడితే రన్స్ వస్తాయి: భరత్
27 February 2023, 16:44 IST
- KS Bharat on Indian Pitches: ఇండియన్ పిచ్లపై ఇలా ఆడితే రన్స్ వస్తాయి అని అన్నాడు టీమిండియా వికెట్ కీపర్ కేఎస్ భరత్. మూడో టెస్ట్ ప్రారంభానికి ముందు భరత్ మీడియాతో మాట్లాడాడు.
ఇండియన్ టీమ్ తో కేఎస్ భరత్
KS Bharat on Indian Pitches: ఇండియా పిచ్ లపై ఆస్ట్రేలియా టీమ్ దుస్థితి ఎలా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. తొలి రెండు టెస్టులు మూడు రోజుల్లోనే ముగిశాయి. ఇండియన్ స్పిన్నర్ల ధాటికి ఆసీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు. రానున్న రెండు టెస్టుల్లోనూ కంగారూలను తెగ కంగారు పెడుతోంది పిచ్లు, మన స్పిన్నర్లు. ఈ నేపథ్యంలో టీమిండియా వికెట్ కీపర్ కేఎస్ భరత్.. ఇండియన్ పిచ్ లపై ఎలా ఆడాలో చెప్పాడు.
ఇండోర్ లో బుధవారం (మార్చి 1) నుంచి మూడో టెస్ట్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇండియన్ పిచ్ లపై షాట్ సెలక్షన్ చాలా ముఖ్యమని ఈ సందర్భంగా భరత్ చెప్పాడు. అదే సమయంలో డిఫెన్స్ పై కూడా నమ్మకముంచాలని అన్నాడు.
"ఢిల్లీ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో నేను ఆరో నంబర్ లో బ్యాటింగ్ చేయాలని రోహిత్ భాయ్ చెప్పాడు. ఆస్ట్రేలియా ఆలౌట్ కాగానే నేను బ్యాటింగ్ కు సిద్ధమయ్యాను. ఇలాంటి పిచ్ లపై షాట్ సెలక్షన్ కీలకం. షాట్ సెలక్షన్ సరిగా ఉంటే సక్సెస్ కావచ్చు. డిఫెన్స్ పై నమ్మకం ఉంచడం కూడా ముఖ్యం" అని భరత్ స్పష్టం చేశాడు.
కేఎల్ రాహుల్ ఉంటాడా?
ఇక తుది జట్టులో కేఎల్ రాహుల్ స్థానంపై కూడా భరత్ స్పందించాడు. కొంతకాలంగా రాహుల్ దారుణమైన ఫామ్ లో ఉన్న విషయం తెలిసిందే. అతని స్థానంలో శుభ్మన్ గిల్ ను తీసుకోవాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ తుది జట్టులో ఉంటాడా అని రిపోర్టర్లు ప్రశ్నించారు. దీనిపై స్పందించిన భరత్.. అది టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయం అని, తాను తీసుకునేది కాదని చెప్పాడు.
ఇండియాలో పిచ్ లు మరీ ఆడలేని విధంగా ఏమీ లేవని ఈ సందర్భంగా భరత్ తెలిపాడు. "ఢిల్లీలో ఆడటాన్ని నేను ఎంజాయ్ చేశాను. బ్యాటింగ్ ను సింపుల్ గా ఉంచుతూ డిఫెన్స్ కాస్త చూసుకుంటే చాలు. పిచ్ లు మరీ ఆడలేని విధంగా ఏమీ లేవు" అని భరత్ స్పష్టం చేశాడు.
నాలుగు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇండియా ఇప్పటికే 2-0 లీడ్ లో ఉన్న విషయం తెలిసిందే. మిగతా రెండు టెస్టుల్లోనూ ఇండియానే ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.