Bhishma Ekadashi 2023 : మాఘమాసంలోని భీష్మ ఏకాదశికి ఎందుకింత ప్రత్యేకతో తెలుసా?
28 January 2023, 14:04 IST
- Bhishma Ekadashi 2023 : మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశి విష్ణుప్రీతికరమైన మహాపర్వం. ఈ రోజున నారాయణార్చన, శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ, జప ఉపవాసాదులు విశేష ఫలాలను ఇస్తాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. భీష్మ నిర్యాణానంతరం వచ్చిన ఏకాదశి కనుక దీనికి 'భీష్మ ఏకాదశి” అని పిలుస్తారు.
భీష్మ ఏకాదశి
Bhishma Ekadashi 2023 : భీష్మ ఏకాదశికి మాఘమాసంలో చాలా ప్రత్యేకత ఉంది. ఇది 2023లో ఫిబ్రవరి 2వ తేదీన వచ్చింది. మరి రోజుకు ఎందుకింత ప్రత్యేకత ఉందో.. దాని వెనుక ఉన్న కారణాలు ఏమిటో తెలుసుకుందాం. గంగామాత స్త్రీరూపంలో గర్భధారిణియై.. వసువులను కుమారులుగా కన్నది. అలా వాళ్లు మనుష్యులై జన్మించారు. జలరూపంలో ఆమె వాళ్లను మళ్లీ తనలోకి తీసేసుకుంది. అంటే గంగాదేవి జగన్మాత్రు స్వరూపిణి కాబట్టి ఆమె గర్భవాసాన జన్మించిన తరువాత ఎవరికీ పాపం ఉండదు. అయితే ఏ కారణం చేతనో ఆమె గర్భాన ఎనిమిదవవాడుగా జన్మించిన భీష్ముడిని ఆమె గంగలో పారవేయబోతుంటే.. ఆమె భర్త అయిన శంతన మహారాజు ఆమెను వారించాడు. అందుకని ఆ పిల్లవాడిని ఆయననే పెంచుకోమని అప్పగించి ఆమె వెళ్లిపోయింది.
లేటెస్ట్ ఫోటోలు
అలా శంతనుడి చేత శాపవిముక్తుడు కాకుండా మిగిలిన భీష్ముడు పెరిగి పెద్దవాడయినాడు. ఆయన బోధించిన విజ్ఞాన సంపద, ఆయన బోధించిన ప్రతి వాక్యము అనాదికాలం నుంచీ వచ్చినటువంటి సత్యానికి అతి సన్నిహితంగా ఉంటుంది. సత్యాన్ని అది ధరించి ఉంటుంది. భారత యుద్ధంలో పదకొండు రోజులు యుద్ధం చేసి గాయపడి.. అంపశయ్యపై పరుండి.. ఉ త్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తున్న భీష్ముణ్ణి చూడడానికి యుద్ధానంతరం పాండవులు కృష్ణుడితో కలిసి వస్తారు. వారితోపాటు అనేక రాజర్షులూ, దేవర్షులూ, బ్రహ్మర్షులూ శిష్యసమేతంగా వచ్చారని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
అసలు భారతంలో భీష్మునిది ఒక ప్రత్యేకమైన పాత్ర. శీలంలోనేమి, శౌర్యంలోనేమి, నీతిలోనేమి, నిష్ఠలోనేమి భీష్మునికి సాటి భీష్ముడే. చిన్నతనం నుంచి ఆయన త్యాగపురుషుడే. తండ్రి కొరకు స్వసుఖాన్నీ, రాజ్యాన్నీ అన్నీ వదులుకున్నవాడు భీష్ముడు తప్ప మరొకడు లేడు. యయాతి పుత్రుడైన పూరుడు తండ్రి మాటతో కొంత కాలం పాటు తండ్రి వృద్ధాప్యాన్ని స్వీకరించాడు. కానీ భీష్ముడు తనంతట తానే తండ్రి సుఖం కొరకు తన వారసత్వ హక్కయిన రాజ్యాన్ని త్యాగం చేయడమే కాక.. భవిష్యత్తులో తన మాట తన సంతానం ఉల్లంఘిస్తారేమో అనే అనుమానంతో వివాహాన్నే వద్దనుకున్నాడు. తన తమ్ములు చనిపోయిన తర్వాత కూడా.. తన భీషణ ప్రతిజ్ఞకు కారణం అయిన సత్యవతీ దేవి స్వయంగా ఆజ్ఞాపించినా.. తన ప్రతిజ్ఞను భంగం చేయడానికి భీష్ముడు అంగీకరించలేదు.
భారతంలో శాంతిపర్వం, అనుశాసనిక పర్వం భీష్ముని మహావిజ్ఞానానికి నిలువెత్తు దర్పణాలు. అష్టమనువుల్లో ఒకరిగా, శౌర్యప్రతాపంలో అసమాన ప్రతిభ కలిగిన మహానుభావుడు... భీష్మాచార్యుడు. కురువృద్ధుడు, అత్యంత శక్తివంతుడు, తెలివైనవాడు అయిన భీష్మాచార్యుడు మహాభారత యుద్ధంలో నేలకొరిగినప్పటికీ.. దక్షిణాయనంలో మరణించడం ఇష్టంలేక ఉత్తరాయణంకోసం వేచి ఉన్నాడు. తన నిర్యాణానికి తానే సమయం నిర్ణయించుకున్నాడు.
58 రోజులు అంపశయ్యపై పవళించి ఉత్తరాయణ పుణ్య తిథికోసం వేచిచూస్తోన్న భీష్ముని చూసేందుకు శ్రీకృష్ణుడు వచ్చాడు. అందుకు అమితానందం పొందిన భీష్ముడు శ్రీమన్నారాయణుని వేయి నామాలతో కీర్తించాడు. అదే ఇంటింటా భక్తి ప్రపత్తులతో పారాయణం చేసే విష్ణు సహస్రనామం. అనంతరకాలంలో రాజ్యపాలన చేయవలసి ఉన్న ధర్మరాజును ఉద్దేశించి రాజనీతి అంశాలను బోధించాడు. ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు భీష్ముడు ఇచ్చిన సమాధానమే విష్ణు సహస్రనామానికి ఉపోద్ఘాతం. మాఘ శుద్ధ అష్టమి నాడు భీష్మాచార్యుని ఆత్మ శ్రీకృష్ణునిలో లీనమైంది. భీష్ముడు మోక్షం పొందిన తర్వాత వచ్చిన మాఘ శుద్ధ ఏకాదశిని “భీష్మ ఏకాదశి”, “మహాఫల ఏకాదశి”, “జయ ఏకాదశి” అని అంటారు.
విష్ణు సహస్రనామం ఎప్పుడు పఠించినా.. ఎప్పుడు విన్నా పుణ్యం కలుగుతుంది. ముఖ్యంగా భీష్మ ఏకాదశినాడు గనుక విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే.. ఆ ఫలితం అనంతంగా ఉంటుంది. అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి. భోగభాగ్యాలు కలుగుతాయి. సర్వ పాపాలూ హరిస్తాయి. పుణ్యగతులు లభిస్తాయి. అంతేకాకుండా గ్రహదోషాలు, నక్షత్రదోషాలు ఉన్నవారు కూడా విష్ణు సహస్రనామాన్ని ప్రతినిత్యం పారాయణం చేస్తే చాలు అన్నింటి నుంచి విముక్తి పొందడమే కాకుండా అన్నింటా విజయం సాధిస్తారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, చిలకమర్తి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
టాపిక్