Modi with Indian diaspora in Bali: ‘మోదీ.. మోదీ’ నినాదాలతో హోరెత్తిన ప్రాంగణం
15 November 2022, 18:02 IST
Modi with Indian diaspora in Bali: జీ 20 సదస్సు కోసం ఇండోనేషియా వెళ్లిన ప్రధాని మోదీ అక్కడి భారతీయులు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.
బాలిలో ఇండోనేషియా సంప్రదాయ సంగీత వాయిద్యాన్ని మోగిస్తున్న ప్రధాని మోదీ
Modi with Indian diaspora in Bali: జీ 20 (G20) సందర్భంగా ఇండినేషియాకు వచ్చిన మోదీ బాలిలో భారతీయులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అక్కడ సెటిల్ అయిన భారతీయులు హాజరయ్యారు. మోదీని చూడగానే వారు ‘మోదీ.. మోదీ’ అనే నినాదాలతో ఆ ప్రాంగణాన్ని హోరెత్తించారు.
Modi with Indian diaspora in Bali: డ్రమ్స్ వాయించి..
ఆ కార్యక్రమంలో ఇండోనేషియా సంప్రదాయ వాయిద్యమైన డ్రమ్ వంటి సంగీత పరికరాన్ని మోదీ వాయించారు. ఆ సమయంలో కూడా సభకు హాజరైన వారు మోదీ, మోదీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇండోనేషియాలోని భారతీయులు ఎన్నో విజయాలను అందుకున్నారని, వారి విజయాలకు భారతీయులకు గర్వకారణమని ప్రధాని కొనియాడారు. భారత్, ఇండోనేషియాలు శతాబ్దాలుగా సాంస్కృతిక భాగస్వామ్యులని గుర్తు చేశారు.
Modi with Indian diaspora in Bali: భారత్ లో బాలి యాత్ర మహోత్సవం
ఈ సందర్భంగా భారత్ లోని కటక్ లో ప్రతీ సంవత్సరం జరిగే బాలి యాత్ర మహోత్సవం గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. ‘నేను ఇక్కడ బాలిలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సమయంలో.. 1500కిమీలకు ఆవల భారత్ లోని కటక్ లో బాలి యాత్ర మహోత్సవం ‘బాలి జాతర’ జరుగుతోంది. వేలాది సంవత్సరాల ఇండియా, ఇండోనేషియాల సంబంధాలను ఈ ఉత్సవం ప్రతిబింబిస్తుంది’ అని మోదీ వివరించారు.
Modi with Indian diaspora in Bali: ఆపరేషన్ సముద్ర మైత్రి
అన్ని సమయాల్లో భారత్, ఇండోనేషియాల మధ్య స్నేహ సహకారాలు కొనసాగాయని ప్రధాని మోదీ గుర్తు చేశారు. 2018లో ఇండోనేషియాలో భారీ భూకంపం వచ్చి, తీవ్ర స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టాలను కలుగజేసినప్పుడు, భారత్ వెంటనే స్పందించి, ‘ఆపరేషన్ సముద్ర మైత్రి’ని ప్రారంభించిందని గుర్తు చేశారు. భారత్, ఇండోనేషియాలు 90 నాటికల్ మైళ్ల దూరంలో కాదు.. 90 నాటికల్ మైళ్ల సమీపంలో ఉన్నాయని ఆ సమయంలో తాను వ్యాఖ్యానించానని గుర్తు చేశారు.
Modi with Indian diaspora in Bali: పాత ఇండియా కాదు..
భారత్ ఇప్పుడు అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతోందని మోదీ తెలిపారు. భారతీయుల నైపుణ్యాలు, సాంకేతిక, సృజనాత్మక, కష్టించే తత్వం.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సాధించాయని మోదీ వివరించారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ దూసుకుపోతోందన్నారు. మునుపెన్నడు లేని వేగంతో, అప్రతిహతంగా భారత్ అభివృద్ధి ప్రయాణం సాగుతోందన్నారు.
టాపిక్