Viral | ఓలా స్కూటర్ను గాడిదకు కట్టి రోడ్ల మీద ఊరేగింపు
25 April 2022, 20:42 IST
- మహారాష్ట్ర: కొనుగోలు చేసిన ఆరు రోజులకే అతడి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పనిచేయడం మానేసింది. కంపెనీకి ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదు. సహనాన్ని కోల్పోయిన అతడు.. ఓలా స్కూటర్ను గాడిదకు కట్టి రోడ్లు మీద ఊరేగించాడు. పాలీ పట్టణంలో జరిగింది ఈ ఘటన.
ఓలా స్కూటర్ను గాడిదకు కట్టి ఊరేగింపు..
Ola scooter donkey | మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి.. తనకు వచ్చిన సమస్యపై వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. ఓలా స్కూటర్ను గాడిదకు కట్టి ఊరేగించాడు.
కారణం ఏంటంటే..
బీడ్ జిల్లాకు చెందిన సచిన్ గిట్టే.. 2021 సెప్టెంబర్లో.. ఓలా సంస్థ నుంచి ఓ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని బుక్ చేసుకున్నాడు. 2022 మార్చ్ 24న డెలివరీ అందింది. కానీ కొన్న ఆరు రోజులకే అది పనిచేయడం మానేసింది. ఈ విషయంపై ఓలా కంపెనీని ఆయన సంప్రదించాడు. ఓ మెకానిక్ వచ్చి స్కూటర్ను చూసి వెళ్లాడు. అంతే! ఓలా నుంచి ఎలాంటి స్పందన లభించలేదు. కస్టమర్ కేర్కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లాభం లేకుండాపోయింది. పైగా.. వారందరు తమ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మొదలుపెట్టారు.
సచిన్ గిట్టేకు కోపం వచ్చింది. ఫలితంగా.. ఓలా స్కూటర్ను గాడిదకు కట్టాడు. పార్లీ పట్టణం రోడ్ల మీద ఊరేగించాడు. వాటికి బ్యానర్లు కూడా తగిలించాడు. 'ఓలాను నమ్మకండి. ఓలా వాహనాలు కొనకండి. మోసపోకండి,' అంటూ రాసుకొచ్చాడు.
సచిన్ గిట్టే.. కన్జ్యూమర్ ఫోరంను సైతం సంప్రదించినట్టు తెలుస్తోంది. బైక్ రిపేరు చేయించలేదని వాపోయాడు. ఓలా సంస్థపై దర్యాప్తు చేపట్టి.. ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ దృశ్యాలను స్థానిక వార్తా సంస్థ.. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. అవి కాస్త వెంటనే వైరల్గా మారాయి.
వాహనాలకు మంటలు.. ఓలా చర్యలు..
Ola electric scooter | లక్ట్రిక్ వాహనాలకు మంటలు అంటుకుంటున్న ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నాయి. ఆయా ఘటనల్లో పలువురు ప్రాణాలు సైతం కోల్పోయారు. తాజాగా.. ఈ వ్యవహారంపై ఓలా చర్యలు చేపట్టింది. తమ సంస్థ రూపొందించిన 1,441 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను వెనక్కి పిలిపించనుంది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటనను విడుదల చేసింది.
పుణెలో గత నెల 26న జరిగిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ వాహనాలను వెనక్కి తీసుకుంటున్నామని ఓలా ఎలక్ట్రిక్ వెల్లడించింది.
"పుణెలోని ఓ ఎలక్ట్రిక్ వాహనానికి మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. అయితే మా సంస్థ రూపొందించిన ఎలక్ట్రిక్ వాహనం ప్రమాదానికి గురైన ఘటన ఇదొక్కటే అని తెలుస్తోంది. అయినప్పటికీ.. 1,441 వాహనాలను వెనక్కి పిలిపిస్తున్నాము. వాటి భద్రత, ఇతర ప్రమాణాలను మరోమారు పరిశీలిస్తాము. మా సర్వీసు ఇంజనీర్లు ఆ పని చూసుకుంటారు. బ్యాటరీ, థర్మల్, సెఫ్టీ వ్యవస్థలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు," అని ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది.
Ola Electric | దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు నిప్పంటుకుంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అనేక సంస్థలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను వెనక్కి పిలిపిస్తున్నాయి. ఒకినావా ఆటోటెక్ సంస్థ.. ఇప్పటికే 3వేలకుపైగా యూనిట్లను వెనక్కి పిలిపించింది. ప్యూర్ఈవీ సంస్థ సైతం 2వేలకుపైగా ఎలక్ట్రిక్ వాహనాలను తిరిగి తీసేసుకుంది.
ఈ అగ్నిప్రమాదాలకు సంబంధించిన ఘటనలను ప్రభుత్వం కూడా తీవ్రంగా పరిగణించింది. వీటిపై ఓ ప్యానెల్ను ఏర్పాటు చేసిన దర్యాప్తు చేపట్టింది. నిర్లక్ష్యం వహిస్తే.. వాహన తయారీ సంస్థలు భారీ మూల్యం చెల్లించుకుంటాయని హెచ్చరికలు జారీ చేసింది.
టాపిక్