Ola | ఎలక్ట్రిక్ వాహనాలకు మంటలు.. 'ఓలా' చర్యలు..!
24 April 2022, 11:39 IST
- ఢిల్లీ: ఓలా ఎలక్ట్రిక్ కీలక నిర్ణయం తీసుకుంది. తాము రూపొందించిన 1,441 ఎలక్ట్రిక్ వాహనాలను వెనక్కి పిలిపించనుంది. ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు మంటలు అంటుకుంటున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది.
ఆ వాహనాలను వెనక్కి పిలిపించిన ఓలా..!
EV fire incidents | ఎలక్ట్రిక్ వాహనాలకు మంటలు అంటుకుంటున్న ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నాయి. ఆయా ఘటనల్లో పలువురు ప్రాణాలు సైతం కోల్పోయారు. తాజాగా.. ఈ వ్యవహారంపై ఓలా చర్యలు చేపట్టింది. తమ సంస్థ రూపొందించిన 1,441 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను వెనక్కి పిలిపించనుంది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది.
పుణెలో గత నెల 26న జరిగిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ వాహనాలను వెనక్కి తీసుకుంటున్నామని ఓలా ఎలక్ట్రిక్ వెల్లడించింది.
"పుణెలోని ఓ ఎలక్ట్రిక్ వాహనానికి మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. అయితే మా సంస్థ రూపొందించిన ఎలక్ట్రిక్ వాహనం ప్రమాదానికి గురైన ఘటన ఇదొక్కటే అని తెలుస్తోంది. అయినప్పటికీ.. 1,441 వాహనాలను వెనక్కి పిలిపిస్తున్నాము. వాటి భద్రత, ఇతర ప్రమాణాలను మరోమారు పరిశీలిస్తాము. మా సర్వీసు ఇంజనీర్లు ఆ పని చూసుకుంటారు. బ్యాటరీ, థర్మల్, సెఫ్టీ వ్యవస్థలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు," అని ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది.
Ola Electric | దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు నిప్పంటుకుంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అనేక సంస్థలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను వెనక్కి పిలిపిస్తున్నాయి. ఒకినావా ఆటోటెక్ సంస్థ.. ఇప్పటికే 3వేలకుపైగా యూనిట్లను వెనక్కి పిలిపించింది. ప్యూర్ఈవీ సంస్థ సైతం 2వేలకుపైగా ఎలక్ట్రిక్ వాహనాలను తిరిగి తీసేసుకుంది.
ఈ అగ్నిప్రమాదాలకు సంబంధించిన ఘటనలను ప్రభుత్వం కూడా తీవ్రంగా పరిగణించింది. వీటిపై ఓ ప్యానెల్ను ఏర్పాటు చేసిన దర్యాప్తు చేపట్టింది. నిర్లక్ష్యం వహిస్తే.. వాహన తయారీ సంస్థలు భారీ మూల్యం చెల్లించుకుంటాయని హెచ్చరికలు జారీ చేసింది.
టాపిక్