RBI repo rate hike: వడ్డీ రేట్ల పెంపులో తగ్గనున్న దూకుడు..
04 August 2022, 15:50 IST
- RBI repo rate hike: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు సవరణకు రేపు శుక్రవారం మానిటరీ పాలసీ కమిటీ సమావేశం నిర్వహించనుంది.
Reserve Bank of India (RBI) : శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ సమావేశం జరగనుంది
ముంబై, ఆగస్టు 4: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం తన పాలసీ రెపో రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉంది. అలాగే ద్రవ్యోల్బణం అంచనాలను, వృద్ధి అంచనాలను కూడా సవరించే అవకాశం ఉందని సునిధి సెక్యూరిటీస్ గురువారం తెలిపింది.
‘ఇక ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు వేగాన్ని తగ్గిస్తుందని తన ఆగస్టు మానిటరీ పాలసీ కమిటీ సమావేశం ద్వారా సంకేతాన్నిస్తుందని మా అంచనా’ అని సునిధి సెక్యూరిటీస్కు చెందిన ఆర్థికవేత్త సిద్ధార్థ్ కొఠారి విశ్లేషించారు.
ప్రతి సమావేశంలో రేట్లను పెంచడానికి కట్టుబడి ఉండదని సూచించడానికి రిజర్వ్ బ్యాంక్ సంకేతాన్ని ఇస్తుందని ఆకాంక్షించారు.
రాయిటర్స్ పోల్ ప్రకారం.. రెపో రేటు 25 బేసిస్ పాయింట్ల నుంచి 50 బేసిస్ పాయింట్ల వరకు పెరుగుతుందని ఆర్థిక వేత్తలు తమ అంచనాలను వెల్లడించారు. శుక్రవారం రెపో రేటు పెంపుపై అంచనాలు భిన్నంగా ఉన్నాయి.
ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను అరికట్టేందుకు మే నెలలో ఆకస్మికంగా జరిపిన మానిటరీ కమిటీ సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును రెండు సమావేశాల్లో 90 బేసిస్ పాయింట్ల మేర పెంచి 4.90 శాతానికి పెంచింది.
మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సెంట్రల్ బ్యాంక్ తన ద్రవ్యోల్బణ అంచనాను స్వల్పంగా 20 బేసిస్ పాయింట్ల మేర 6.70%కి పెంచుతుందని సునిధి అంచనా వేస్తోంది. అయితే వృద్ధి అంచనాను ప్రస్తుత 7.2% నుండి 6.80%కి 40 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తుందని అంచనా వేసింది.
భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం గత మూడు నెలలుగా 7% పైన ఉంది. కానీ ఏప్రిల్లో ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 7.79%కి చేరిన తర్వాత కాస్త తగ్గింది.
‘ఆగస్టు నుండి వడ్డీ రేట్ల పెంపుదలలో దూకుడు తగ్గి నెమ్మదిస్తుంది. ధరల్లో స్థిరత్వాన్ని తెచ్చేందుకు, అలాగే ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై ప్రభావం చూపనిరీతిలో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే దిశగా వడ్డీ రేట్ల పెంపు ఉంటుంది..’ అని సునిధి సెక్యూరిటీస్ విశ్లేషించింది.
టాపిక్