Electronics Mart India IPO: ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఐపీవో ప్రైస్ బ్యాండ్ రూ. 56-59
28 September 2022, 13:30 IST
Electronics Mart India IPO: ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఐపీవో అక్టోబరు 4న ప్రారంభం కానుంది. దీని ప్రైస్ బ్యాండ్ షేరుకు రూ. 56 నుంచి రూ. 59గా నిర్ధారించారు.
అక్టోబరు 4న ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా ఐపీవో
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: కన్స్యూమర్ డ్యూరబుల్స్ రిటైల్ చైన్ ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా లిమిటెడ్ తన రూ. 500 కోట్ల ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపిఓ)కి షేరు ధర రూ. 56-59గా నిర్ణయించినట్లు బుధవారం తెలిపింది.
అక్టోబర్ 4న ఐపీఓ పబ్లిక్ సబ్స్క్రిప్షన్ కోసం ప్రారంభమవుతుందని, అక్టోబర్ 7న ముగుస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. IPOలో ఆఫర్ ఫర్ సేల్ కాంపోనెంట్ లేకుండా రూ. 500 కోట్లకు ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ ఉంటుంది.
కంపెనీ తన మూలధన వ్యయానికి నిధులు సమకూర్చడానికి, పెరుగుతున్న వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించడానికి, రుణాలు చెల్లించడానికి నికర ఆదాయాన్ని ఉపయోగించాలని భావిస్తోంది. సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం కూడా ఈ నిధులు ఉపయోగిస్తారు.
ఇష్యూ పరిమాణంలో సగం క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు, 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు, మిగిలిన 15 శాతం నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు రిజర్వ్ చేసింది. పెట్టుబడిదారులు కనిష్టంగా 254 ఈక్విటీ షేర్ల కోసం బిడ్ వేయవచ్చు.
Electronics Mart India Ltd (EMIL): పవన్ కుమార్ బజాజ్, కరణ్ బజాజ్ 'బజాజ్ ఎలక్ట్రానిక్స్' పేరుతో కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎలక్ట్రానిక్స్ స్టోర్లు స్థాపించారు. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా లిమిటెడ్ పేరుతో స్టాక్ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారు.
ఈ ఏడాది ఆగస్టు నాటికి కంపెనీ బజాజ్ ఎలక్ట్రానిక్స్ 36 నగరాల్లో 112 స్టోర్లను కలిగి ఉంది. కిచెన్, హోం అప్లయెన్సెస్, ఎలక్ట్రానిక్స్ అమ్మకాల్లో దక్షిణ భారత దేశంలో బలమైన వాటా కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో స్టోర్ నెట్వర్క్ను మరింత విస్తృతం చేయాలని, ఎన్సీఆర్-ఢిల్లీలో క్రమంగా విస్తరించాలని యోచిస్తోంది.
కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం గత ఏడాది ఇదే కాలంలో రూ. 320.18 కోట్ల నుంచి రూ. 434.93 కోట్లకు.. అంటే 36 శాతం పెరిగింది. అదే సమయంలో పన్ను తర్వాత లాభం రూ. 58.62 కోట్ల నుంచి రూ. 103.89 కోట్లకు పెరిగింది.
ఆనంద్ రాఠీ అడ్వైజర్స్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్, జేఎం ఫైనాన్షియల్ ఇష్యూకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా ఉన్నారు.
టాపిక్