Congress presidential polls : కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక పూర్తి- ఫలితాలు ఎప్పుడంటే..!
17 October 2022, 17:02 IST
Congress presidential polls : సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ఓటింగ్ ప్రక్రియ.. సాయంత్రం 4 గంటలకు ముగిసింది. సోనియా, ప్రియాంక గాంధీలతో పాటు అనేక మంది కాంగ్రెస్ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటింగ్ పూర్తి- ఫలితాలు ఎప్పుడంటే..!
Congress presidential polls : కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు పోలింగ్ ముగిసింది. సోమవారం సాయంత్రం 4 గంటల వరకు.. వివిధ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయాల్లో.. 9వేల మంది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. శశి థరూర్, మల్లిఖార్జున ఖర్గేలో ఒకరు.. అధ్యక్ష పదవిని చేపట్టనున్నారు.
ఓటేసిన ప్రముఖులు..
దేశవ్యాప్తంగా.. సోమవారం ఉదయం 10 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఫలితంగా దాదాపు అన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయాలు కిటకిటలాడిపోయాయి. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో.. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో కలిసి ఓటేశారు ప్రస్తుత అధ్యక్షురాలు సోనియా గాంధీ. ఈ రోజు కోసం చాలా కాలంగా ఎదురుచుస్తున్నట్టు వెల్లడించారు.
Congress presidential election ends : అనంతరం.. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. పీ. చిదంబర్ సైతం ఓటు వేశారు.
ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ.. మరో 40మందితో కలిసి కర్ణాటక బళ్లారిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంప్సైట్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నట్టు తెలుస్తోంది.
గెలుపెవరిది?
Kharge vs Shashi Tharoor : తాజా ఎన్నిక రహస్య బ్యాలెట్ పద్ధతిలో జరిగింది. మంగళవారం సాయంత్రం నాటికి.. అన్ని బ్యాలెట్ బాక్సులు.. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి చేరుకుంటాయి. బుధవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. అదే రోజు ఫలితాలు వెలువడతాయి.
ఖర్గేకు గాంధీల మద్దతు ఉందని సర్వత్రా ప్రచారాలు జరిగాయి. అయితే గెలుపుపై చాలా ధీమాగా ఉన్నట్టు శశి థరూర్ వెల్లడించారు. గాంధీలు తటస్థంగా ఉన్నట్టు, బహిరంగంగా ఎవరికీ మద్దతు ఇవ్వలేదని అభ్యర్థులిద్దరు చెప్పారు.
వీళిద్దరిలో ఎవరు గెలిచినా.. 20ఏళ్ల తర్వాత తొలిసారిగా గాంధీయేతరు కాంగ్రెస్ సభ్యుడు.. పార్టీ అధ్యక్ష పదవి చేపడుతున్నట్టు అవుతుంది. కొత్తగా బాధ్యత స్వీకరించే వ్యక్తిపై చాలా అంచనాలు ఉన్నాయి. పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే బాధ్యత ఆయనపైనే ఉండనుంది.