Merge JD(U) with Congress: ప్రశాంత్ కిషోర్ పై బిహార్ సీఎం సంచలన ఆరోపణలు
08 October 2022, 19:51 IST
Merge JD(U) with Congress: పాత మిత్రుడు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై బిహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు.
ప్రశాంత్ కిషోర్, నితీశ్ కుమార్
Merge JD(U) with Congress: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీజేపీ కోసం పని చేస్తున్నారని నితీశ్ కుమార్ ఆరోపించారు. సోషలిస్ట్ నేత జయప్రకాశ్ నారాయణ్ జన్మస్థలమైన సితాబ్ దయారాలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
Merge JD(U) with Congress: కాంగ్రెస్ లో కలిపేయమన్నాడు..
ఒకానొక సమయంలో జేడీయూ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని ప్రశాంత్ కిషోర్ తనకు సూచించాడని నితీశ్ కుమార్ వెల్లడించారు. ‘ఈ మధ్య ఆయన(ప్రశాంత్ కిషోర్) నన్ను కలిశాడు. నేను తనను కలవమని అడగలేదు. తనే వచ్చాడు. ఇప్పుడు ఆయన చాలా విషయాలు మాట్లాడుతున్నాడు. కానీ , అసలు వాస్తవాన్ని దాచేస్తున్నాడు. నిజానికి, ఆయన నాలుగేళ్ల క్రితం నా పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని కోరాడు’ అని నితీశ్ వెల్లడించారు. ‘జేడీయూ కి నాయకత్వం వహించాలని నితీశ్ నన్ను కోరాడు’ అని ఇటీవల ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలను ఒక జర్నలిస్ట్ ప్రస్తావించగా, నితీశ్ పై విధంగా స్పందించారు.
Merge JD(U) with Congress: అసాధ్యమన్నాను..
నాలుగేళ్ల క్రితం తనను కలిసినప్పుడు జేడీయూ ని కాంగ్రెస్ లో కలిపేయాలని ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదించాడని నితీశ్ వెల్లడించాడు. అయితే, అది అసాధ్యమని తాను ఆయనకు స్పష్టం చేశానన్నారు. బిహార్ లో జేడీయూ అధికారంలోకి రావడానికి సహకరించిన ప్రశాంత్ కిషోర్ ను నితీశ్ కుమార్ 2018లో జేడీయూలోకి ఆహ్వానించారు. ఆయనకు పార్టీ ఉపాధ్యక్ష పదవి కూడా అప్పగించారు. కానీ, ఆ తరువాత వారి మధ్య విబేధాలు తలెత్తడంతో ప్రశాంత్ కిషోర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.