Bhagwant Mann Frankfurt : భగవంత్ మాన్.. నిజంగానే మద్యం సేవించి విమానం ఎక్కారా?
20 September 2022, 13:49 IST
- Bhagwant Mann Frankfurt : మద్యం మత్తులో ఉన్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్ను జర్మనీ విమానంలో నుంచి దింపేశారన్న వార్తలు కలకలం సృష్టించాయి. ఇప్పుడు ఈ విషయంపై విమానయానశాఖ దర్యాప్తు చేపట్టనుంది.
భగవంత్ మాన్
Bhagwant Mann Germany : పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. నిజంగానే మద్యం సేవించి జర్మనీలో విమానం ఎక్కారా? ఆమ్ ఆద్మీ పార్టీని కుదిపేస్తున్న ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టేందుకు భారత విమానయాన శాఖ సిద్ధపడింది.
భగవంత్ మాన్ జర్మనీ పర్యటన..
పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. 8 రోజుల పర్యటన కోసం జర్మనీ వెళ్లారు. అది ముగించుకుని ఆదివారమే ఇండియాకి తిరిగొచ్చారు. అయితే.. ఆయన జర్నీ చేసిన లుప్థాన్స విమానం ఆలస్యంగా ఇండియాకి వచ్చింది.
Bhagwant Mann Lufthansa : ఈ నేపథ్యంలో విపక్ష శిరోమణి అకాలీదళ్.. భగవంత్ మాన్పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. 'మద్యం మత్తులో.. కనీసం నడవలేని స్థితిలో ఉన్న పంజాబ్ సీఎంను ఫ్రాంక్ఫర్ట్లో విమానం నుంచి దింపేశారు. ఇది పంజాబ్ ప్రజలకు సిగ్గు చేటు,' అంటూ ఆరోపించింది. ఆ విమానంలో ప్రయాణిస్తున్న కొందరు.. తమకు ఈ విషయాన్ని చెప్పినట్టు వివరించింది.
విపక్షాల ఆరోపణలను ఆప్ తిప్పికొట్టింది. రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి భగవంత మాన్ విదేశాలకు వెళితే.. విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడింది. కాగా.. ఈ వ్యవహారంపై భగవంత మాన్, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్లు ఇంకా స్పందించలేదు.
Bhagwant Mann news : మరోవైపు ఈ వ్యవహారంపై సంబంధిత విమానయాన సంస్థ స్పందించింది. విమానాల మార్పు కారణంగానే ఆలస్యమైందని వివరణ ఇచ్చింది.
ఇక ఈ విషయంపై విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా స్పందించారు.
"ఇది విదేశాల్లో జరిగింది. అందువల్ల ఇది నిజమో కాదో తెలుసుకుంటాము. డేటా మాత్రం లుఫ్థాన్స ఇవ్వాలి. నాకు అందిన ఫిర్యాదుల మేరకు నేను విచారణ జరుపుతాను," అని జ్యోతిరాదిత్య సింథియా స్పష్టం చేశారు.