AAP: కేజ్రీవాల్ చెప్పిన ఆ బడానేత పేరు బయటపెట్టిన 'ఆప్'
05 June 2022, 8:19 IST
- ఓ బీజేపీ నేత అవినీతిని బయటపెడతామంటూ సీఎం కేజ్రీవాల్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. చెప్పినట్టుగానే బయటపెట్టింది ఆప్. పీపీఈ కిట్ల విషయంలో అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ తీవ్రమైన అక్రమాలకు పాల్పడ్డారని ఆ పార్టీ నేత మనీశ్ సిసోడియా ఆరోపించారు.
మనీష్ సిసోడియా(ఫైల్ ఫొటో)
బీజేపీకి చెందిన ఓ సీనియర్ నాయకుడి అవినీతిని బట్టబయలు చేస్తామంటూ ఆప్ అధినేత కేజ్రీవాల్ చేసిన ప్రకటనపై ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు ఆ పార్టీ సీనియర్ నేత మనీశ్ సిసోడియా. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. అస్సాం సీఎంపై తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం హిమంత బిశ్వశర్మ పీపీఈ కిట్ల కాంట్రాక్టును తన కుటుంబానికి చెందిన సంస్థకు కట్టబెట్టారని, అందుకోసం భారీగా డబ్బు చెల్లించారని సిసోడియా అన్నారు. హిమంత తన భార్యకు చెందిన సంస్థకు పీపీఈ కిట్ల కాంట్రాక్టును అప్పగించారని ఆరోపించారు. రూ.990 చెల్లించి పీపీఈ కిట్లు కొనుగోలు చేశారన్న సిసోడియా... అదేరోజు ఇతరులు వేరే సంస్థ నుంచి కొనుగోలు చేసినందుకు రూ.600 చెల్లించారని వెల్లడించారు. ఈ అవినీతి వ్యవహరాన్నినిరూపించేందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. దీనిపై చర్యలు తీసుకునే ధైర్యం బీజేపీకి ఉందా అని సవాల్ విసిరారు.
ఖండించిన అస్సాం సీఎం…
మరోవైపు మనీశ్ సిసోడియా ఆరోపణలను తీవ్రంగా ఖండించారు అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ. ఆయన ఆరోపణలపై పరువు నష్టం దావా వేస్తానని స్పష్టం చేశారు. తన భార్యకు సంబంధించిన ఎలాంటి సంస్థలకు కాంట్రాక్టు ఇవ్వలేదన్నారు. కొవిడ్ దృష్ట్యా ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఉచితంగా పీపీఈ కిట్లను ప్రభుత్వానికి అందజేసిందని ఓ ప్రకటనలో తెలిపారు.
మనీ లాండరింగ్ కేసులో దిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ అరెస్ట్ వ్యవహరం ఆప్,బీజేపీ మధ్య తీవ్ర విమర్శలకు దారితీస్తున్న సంగతి తెలిసిందే. ఆ అరెస్టు విషయంలో తాజా స్పందించిన కేజ్రీవాల్.. ఓ బీజీపే బడా నేత అవినీతిని సిసోడియా బయటపెడ్తారంటూ ప్రకటన చేశారు. ఇందులో భాగంగా అస్సాం సీఎం అవినీతికి పాల్పడ్డారంటూ సిసోడియా మీడియా సమావేశంలో ఆరోపించారు. మొత్తంగా ఈ పరిణామంతో ఆప్, బీజేపీ మధ్య మాటలయుద్ధం తారాస్థాయికి చేరుతోంది.
టాపిక్