Kejriwal : `సీరియల్ కిల్లర్`.. బీజేపీపై కేజ్రీవాల్ సీరియస్ కామెంట్స్
26 August 2022, 18:56 IST
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీని సీరియల్ కిల్లర్ అని, ఇప్పుడు ఢిల్లీలో వేట సాగించడం కోసం ఎదురు చూస్తోందని ఆరోపించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
Kejriwal comments on BJP : ఢిల్లీలో తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ కుట్ర చేస్తోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. 40 మంది ఆప్ ఎమ్మెల్యేల కొనుగోలుకు రూ. 800 కోట్లని ఆఫర్గా చేస్తోందన్నారు. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను కూల్చడమే ఈ సీరియల్ కిల్లర్ పనిగా పెట్టుకుందని విమర్శించారు. మణిపూర్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, అరుణాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చే కుట్రలు చేసిన సీరియల్ కిల్లర్ బీజేపీ .. ఇప్పుడు ఢిల్లీ వీధుల్లో తిరుగుతోందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
Kejriwal comments on BJP : సోమవారం బల పరీక్ష
AAP ఎమ్మెల్యేలు ఎవరి ప్రలోభాలకు లొంగరని తేల్చిచెప్పేందుకు సోమవారం అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కోబోతున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. ఆప్ ఎమ్మెల్యేలంతా పార్టీకి విశ్వసనీయంగా ఉంటారన్నారు. ఆ విషయం ఈ బలపరీక్ష ద్వారా తేలుతుందన్నారు. తద్వారా ఆప్ ప్రభుత్వాన్ని కూల్చాలన్న బీజేపీ కుట్ర తేలిపోతుందని వ్యాఖ్యానించారు. బీజేపీ `ఆపరేషన్ లోటస్` ఢిల్లీలో మట్టి పాలవుతుందన్నారు.
Kejriwal comments on BJP : రూపాయి కూడా దొరకలేదు
కంచుకోట లాంటి గుజరాత్లో బీజేపీ కుప్పకూలనుందని, గుజరాత్ లో ఓటమి భయంతోనే ఆప్ నేతలపై సీబీఐతో, ఈడీతో బీజేపీ దాడులు చేయిస్తోందని కేజ్రీవాల్ విమర్శించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గెలువబోతోందని బీజేపీకి అర్థమైందన్నారు. ఢిల్లీ డెప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియా ఇంట్లో సీబీఐ చేసిన దాడుల్లో ఒక్క రూపాయి కూడా వారికి దొరకలేదని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.