Bypolls 2022 results : కూలిన కంచుకోటలు- 'ఉప' సమరంలోనూ బీజేపీ జోరు!
26 June 2022, 19:19 IST
Bypolls 2022 results : ఉప ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్, భగవంత్ మన్ పార్టీలకు షాక్ తగిలింది. ఉత్తర్ప్రదేశ్, పంజాబ్లోని ఆయా స్థానాలు వారి చేతుల్లోంచి జారిపోయాయి. మరోవైపు 10 సీట్లకు జరిగిన ఉపఎన్నికల్లో.. ఐదింట్లో బీజేపీ గెలుపొందింది.
కూలిన కంచుకోటలు- 'ఉప' సమరంలోనూ బీజేపీ జోరు!
Bypolls 2022 results : 2022 ఉప ఎన్నికల సమరంలో బీజేపీ జోరు కొనసాగింది. ఇప్పటికే అనేక రాష్ట్రాల అసెంబ్లీలను తన ఖాతాలో వేసుకున్న కమలదళం.. తాజాగా వెలువడిన ఉప ఎన్నికల్లో సత్తా చాటింది. మొత్తం 10 సీట్లలకు(మూడు లోక్సభ, ఏడు అసెంబ్లీ) ఉప ఎన్నికలు జరగ్గా.. వాటిల్లో ఐదింటిని కమలదళం తన ఖాతాలో వేసుకుంది.
విపక్షానికి షాక్..
ఈ దఫా ఉపఎన్నికల్లో విపక్షాలకు గట్టి షాక్ తగిలింది! ముఖ్యంగా ఉత్తర్ప్రదేశ్, పంజాబ్లో పరిస్థితులు తారుమారయ్యాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడంతో తన అజామ్గఢ్ సీటుకు రాజీనామా చేశారు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్. అఖిలేష్ కంచుకోట అయిన ప్రాంతంలో బీజేపీ జెండా రెపరెపలాడింది! ఎస్పీ అభ్యర్థి ధర్మేంద్ర యాదవ్పై బీజేపీ అభ్యర్థి దినేష్ లాల్ యాదవ్ గెలుపొందారు. మరోవైపు ఎస్పీ నేత అజామ్ ఖాన్ రాజీనామా చేయడంతో ఖాళీ ఏర్పడిన రామ్పూర్ నియోజకవర్గానికి ఎన్నికలు జరగ్గా.. అక్కడ కూడా బీజేపీకి చెందిన అభ్యర్థే(ఘనశ్యామ్ లోధి) గెలిచారు.
Sangrur election result 2022 : ఇక పంజాబ్లో.. అధికారంలో ఉన్న ఆమ్అద్మీకి గెట్టి ఎదురుదెబ్బే తగిలిందని చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా గెలుపొందిన అనంతరం సంగ్రూర్ ఎంపీగా రాజీనామా చేశారు భగవంత్ మన్. తాజాగా.. ఆ సీటుకు ఉపఎన్నిక జరగ్గా.. శిరోమణి అకాలీ దళ్కు చెందిన సిమ్రాన్జిత్ సింగ్ మన్ గెలుపొందారు. ఆప్కు పట్టు ఉన్న సంగ్రూర్ చేయి జారిపోవడం ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీసింది. ఇక్కడ బీజేపీకి ముందునుంచే పెద్దగా పట్టులేదు.
ఇక ఢిల్లీలో ఆప్ విజయాల పరంపర కొనసాగింది. రాజేందర్ నగర్లో జరిగిన ఉప సమరంలో బీజేపీ అభ్యర్థి రాజేష్ భాటియాపై ఆప్కు చెందిన దుర్గేష్ పాఠక్.. 11వేల మెజారిటీతో గెలుపొందారు.
త్రిపుర.. ఆంధ్రప్రదేశ్..
త్రిపురలో బీజేపీ హవా స్పష్టంగా కనిపించింది. నాలుగు అసెంబ్లీ సీట్లకు జరిగిన ఎన్నికల్లో మూడింట్లో భారీ విజయాలను అందుకుంది. అందులో సీఎం మానిక్ సాహు పోటీ చేసిన బర్దోవాలి నియోజకవర్గం ఒకటి. 6వేల మెజారిటీతో ఆయన గెలుపొందారు. ఒక సీటు కాంగ్రెస్కు దక్కింది.
ఝార్ఖండ్ మందార్లో కాంగ్రెస్ అభ్యర్థి శిల్పా నేహా తిర్కే గెలిచారు. ఆమె తండ్రి.. బందు తిర్కేపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయనపై అనర్హత వేటుపడింది. ఫలితంగా అక్కడ ఖాళీ ఏర్పడింది.
Atmakur Bypoll results : ఇక ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి చెందిన మేకపాటి విక్రమ్ రెడ్డి.. ఆత్మకూర్లో గెలిచారు.