By Election : ముగిసిన ఆత్మకూరు ఉపఎన్నిక పోలింగ్
23 June 2022, 20:21 IST
- నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉపఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది.
ప్రతీకాత్మక చిత్రం
ఆత్మకూరు ఉపఎన్నిక ముగిసింది. సాయంత్రం 5 వరకు 61.70 శాతం ఓటింగ్ నమోదుకాగా.. క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం ఇచ్చారు. మెుత్తం పోలింగ్ పూర్తయ్యేసరికి.. 70 శాతం వరకూ పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు.
వైసీపీ నుంచి గెలుపొంది.. మంత్రిగా పని చేసిన మమేకపాటి గౌతమ్ రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరిలో చనిపోయారు. దీంతో ఇక్కడ ఉపఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. జూన్ 26న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
ఈ ఉపఎన్నికలో సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం కొంత తగ్గినట్టుగా తెలుస్తోంది. ఉపఎన్నిక కారణంగా ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపించినట్టుగా లేదు. ఆత్మకూరు నియోజకవర్గంలో అక్కడక్కడా స్పల్ప ఘటనలు జరిగాయి. పోలింగ్ కేంద్రంలోకి ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లను ప్రలోభ పెడుతున్నారంటూ స్వతంత్ర అభ్యర్థి శశిధర్ రెడ్డి వైసీపీ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
దీంతో పోలీసులకు, శశిధర్ రెడ్డికి వాగ్వాదం నడిచింది. మర్రిపాడు మండలం కృష్ణాపురం పోలింగ్ కేంద్రంలో బీజేపీ ఏజెంట్ విష్ణుని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. ఆ పార్టీ అభ్యర్థి భరత్ కుమార్ యాదవ్ను కారులో తీసుకెళ్తున్న ఏజెంటుని తిమ్మనాయుడు పేట వద్ద గుర్తించి తీసుకొచ్చారు. దీంతో వైసీపీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడిచింది.
ఆత్మకూరు ఉప ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యేసరికి 70 శాతం వరకూ పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఈ నెల 26న ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు.