By Election results 2022 : ‘ఉప’ సమరంలో బీజేపీ హవా..!
06 November 2022, 12:33 IST
- By Election results 2022 : ఉపఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో తేలిపోనున్నాయి. కాగా.. 7 సీట్లకు ఎన్నికలు జరగ్గా.. నాలుగింట్లో బీజేపీ ప్రస్తుతం లీడ్లో ఉంది.
‘ఉప’ సమరంలో బీజేపీ హవా..!
By Election results 2022 : దేశంలో 'ఉపఎన్నికల' ఉత్కంఠ పతాకస్థాయికి చేరింది. మొత్తం ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరగ్గా.. ఆదివారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. పటిష్ఠ బందోబస్తు మధ్య ఓట్లను లెక్కిస్తున్నారు అధికారు. పలు ప్రాంతాల్లో పరిస్థితులు.. వార్ వన్ సైడ్ అన్నట్టు ఉండగా.. ఇంకొన్ని చోట్ల మాత్రం హోరాహోరీ యుద్ధం నడుస్తోంది.
ఉత్తర్ప్రదేశ్..
బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అరవింద్ గిరి మరణంతో.. ఉత్తర్ప్రదశ్లో గోల గోఖర్నాథ్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరిగింది. ఇక్కడ బీజేపీ, ఎస్పీ మధ్య పోటీ నడిచింది. బీఎస్పీ, కాంగ్రెస్లు పోటీ చేయలేదు. కాగా.. తాజా వార్తల ప్రకారం.. ఎస్పీ అభ్యర్థి వినయ్ తివారీపై బీజేపీ అభ్యర్థి అమన్ గిరి(అరవింద్ గిరి తనయుడు) ఆధిక్యంలో ఉన్నారు.
బిహార్..
Bihar By Election results : సీఎం నితీశ్ కుమార్.. బీజేపీకి వీడ్కోలు పలికి విపక్షాలతో జత కట్టిన తర్వాత.. బిహార్లో తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. ఇక్కడ మొకామ, గోపాల్గంజ్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించారు. తాజా లెక్కింపులో.. సిట్టింగ్ స్థానమైన మోకామను ఆర్జేడీ కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థి సోనమ్ దేవిపై ఆర్జేడీ అభ్యర్థి నీలిమ్ దేవి గెలుపొందారు. నీలిమ్ దేవీ భర్త, అనంత్ సింగ్ అనర్హత వేటుతో ఎమ్మెల్యే సీటును కోల్పోవడంతో ఇక్కడ ఎన్నిక అనివార్యమైంది.
కాగా.. సిట్టింగ్ స్థానమైన గోపాల్గంజ్లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. పలు దశాబ్దాలుగా బీజేపీ ఖాతాలోనే ఉన్న ఈ సీటును దక్కించుకోవాలని ఆర్జేడీ చూస్తోంది. బీజేపీ అభ్యర్థి కుసుమ్ దేవి.. ఆర్జేడీ అభ్యర్థి మోహన్ గుప్తా మధ్య పోటీ నెలకొంది.
హరియాణా..
హరియాణాలో అదంపూర్ నియోజకవర్గానికి ఉపఎన్నిక నిర్వహించారు. ఇందులో బీజేపీ తరపున బరిలో దిగిన భవ్య బిష్ణోయ్.. 35వేలకుపైగా మెజారిటీతో గెలుపువైపు దూసుకెళుతున్నారు. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే, భవ్య బిష్ణోయ్ తండ్రి.. కుల్దీప్పై అనర్హత వేటుపడటంతో ఎన్నిక అనివార్యమైంది.
మహారాష్ట్ర..
Andheri East By election result : మహారాష్ట్ర అంధేరీ ఈస్ట్కు ఉపఎన్నిక నిర్వహించారు. శివసేన అభ్యర్థి రుతుజ లట్కే.. ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె భర్త, శివసేన మాజీ ఎమ్మెల్యే మరణంతో ఈ ఎన్నిక అనివార్యమైంది.
ఉద్ధవ్ ఠాక్రే- ఎక్నాథ్ శిండే- బీజేపీ వ్యవహారం తర్వాత మహారాష్ట్రలో జరిగిన తొలి ఎన్నిక ఇది. పార్టీని పెట్టిన తర్వాత.. పేరు, చిహ్నాన్ని మార్చుకుని ఉద్ధవ్ ఠాక్రే వర్గం పోటీ చేస్తుండటం ఇదే తొలిసారి.
ఒడిశా..
ఒడిశా ధామ్నగర్లో అధికార బీజేడీ, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే, బీజేపీ నేత బిష్ణు చరణ్ మరణంతో ఎన్నిక అనివార్యమైంది. ఆయన తనయుడిని బీజేపీ బరిలో దింపింది. బీజేపీ ఇక్కడ ముందంజలో ఉంది.
తెలంగాణ..
Munugodu By Election result : మునుగోడు ఉపఎన్నిక ఫలితాలు తీవ్ర ఉత్కంఠకు దారి తీస్తున్నాయి. ఇక్కడ టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. బీజేపీపై ప్రస్తుతం టీఆర్ఎస్ స్వల్ప ఆధిక్యంలో ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మొత్తం మీద 7 సీట్లల్లో.. బీజేపీ నాలుగు స్థానాల్లో ముందంజలో ఉంది.