Bharti airtel 5g launch: 5జీ సేవలు ఈ నెలాఖరులోనే: భారతీ ఎయిర్టెల్
04 August 2022, 21:29 IST
- Bharti airtel 5g launch: మరికొద్ది రోజుల్లోనే దేశంలో 5జీ మొబైల్ సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ నెలాఖరులోనే కార్యరూపం దాల్చనున్నట్టు భారతీ ఎయిర్ టెల్ సంస్థ ప్రకటించింది.
ఈనెలాఖరులో 5జీ సేవలు ప్రారంభించనున్నట్టు ప్రకటించిన భారతీ ఎయిర్టెల్ సంస్థ
Bharti airtel 5g launch: టెలికాం ఆపరేటర్ భారతీ ఎయిర్టెల్ ఈ నెలాఖరులో 5జీ సేవలు ప్రారంభించనుంది. ఇందుకోసం ఎరిక్సన్, నోకియా, శాంసంగ్లతో అవసరమైన ఒప్పందాలు చేసుకుంది.
టెలికాం డిపార్ట్మెంట్ ద్వారా 5G సేవల కోసం ఇటీవల జరిగిన స్పెక్ట్రమ్ వేలంలో ఎయిర్టెల్ 900 MHz, 1800 MHz, 2100 MHz, 3300 MHz, 26 GHz ఫ్రీక్వెన్సీలలో 19867.8 MHZ స్పెక్ట్రమ్ను బిడ్ చేసి కొనుగోలు చేసింది.
‘Airtel ఆగస్ట్లో 5G సేవలను ప్రారంభిస్తుందని ప్రకటించడానికి మేం సంతోషిస్తున్నాం. మా నెట్వర్క్ ఒప్పందాలు పూర్తయ్యాయి. 5G కనెక్టివిటీ పూర్తి ప్రయోజనాలను మా వినియోగదారులకు అందించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ సాంకేతిక భాగస్వాములతో Airtel పని చేస్తుంది..’ అని ఎయిర్టెల్ ఎండీ, సీఈవో గోపాల్ విట్టల్ తెలిపారు.
‘డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా భారతదేశపు పరివర్తనలో టెలికాం ప్రధానపాత్ర పోషిస్తుంది. పరిశ్రమలు, సంస్థలు, భారతదేశ సామాజిక-ఆర్థిక అభివృద్ధి డిజిటల్ పరివర్తనలో 5G గేమ్-ఛేంజర్గా నిలుస్తుంది..’ అని వివరించారు.
సోమవారం ముగిసిన 5జీ స్పెక్ట్రమ్ వేలంలో భారతీ ఎయిర్టెల్ రూ.43,084 కోట్ల విలువైన బిడ్లు వేసింది.
పాల్గొన్న నలుగురిలో భారతీ ఎయిర్టెల్ రెండో అతిపెద్ద బిడ్డర్గా నిలిచింది. స్పెక్ట్రమ్ మొత్తం విలువ రూ. 150,173 కోట్లలో రిలయన్స్ జియో 58.65 శాతం వాటాతో అతిపెద్ద బిడ్డర్గా నిలిచింది.
స్పెక్ట్రమ్ వేలంలో రిలయన్స్ జియో, అదానీ గ్రూప్, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా నాలుగు ప్రధాన భాగస్వాములు.
5జీ నెట్ వర్క్ అంటే..
5G ఐదో తరం మొబైల్ నెట్వర్క్. ఇది చాలా వేగంగా డేటాను ప్రసారం చేస్తుంది. 3G, 4Gతో పోల్చితే 5G లో లేటెన్సీ కలిగి ఉంటుంది. ఇది వివిధ రంగాలలో వినియోగదారులకు మెరుగైన పనితీరు అందిస్తుంది. లో లేటెన్సీ అంటే అతి తక్కువ ఆలస్యంతో అత్యధిక పరిమాణంలో డేటా సందేశాలను ప్రాసెస్ చేసే సామర్థ్యం ఉండడం. 5G సేవలు 4G కంటే దాదాపు 10 రెట్లు వేగంగా ఉంటాయని అంచనా.
భారతదేశంలో 5G లాంఛ్ అవడం వల్ల మైనింగ్, వేర్హౌసింగ్, టెలిమెడిసిన్, తయారీ వంటి రంగాలలో రిమోట్ డేటా మానిటరింగ్లో మరింత అభివృద్ధిని తీసుకువస్తుందని భావిస్తున్నారు.
టెలికాం ఆపరేటర్లకు స్పెక్ట్రమ్ల కేటాయింపు ఆగస్టు 15లోపు ఉంటుందని, ఆ తరువాత దేశంలో 5G సేవలు పలు నగరాల్లో ప్రారంభమవుతాయి.