తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Apsrtc Introduce E Pos Machines In Tirupati

APSRTC e-PoS Machines : ఇక బస్ టికెట్లు ఇవ్వడం మరింత ఈజీ

HT Telugu Desk HT Telugu

08 September 2022, 16:24 IST

    • APSRTC : ఏపీఎస్ఆర్టీసీ మ‌రో కీల‌క నిర్ణయం తీసుకుంది. చిల్లర సమస్యలు, ఇతర సమస్యలు అధిగమించేందుకు ఆర్టీసీ బ‌స్సుల్లో టికెట్ ఇష్యూయింగ్ యంత్రాల స్థానంలో ఈ పొస్ మిషన్లను తీసుకురావాలని నిర్ణయించింది.
ఏపీఎస్ఆర్టీసీ
ఏపీఎస్ఆర్టీసీ

ఏపీఎస్ఆర్టీసీ

టికెట్ లాంచింగ్ మెషీన్ల స్థానంలో APSRTC తిరుపతి రీజియన్లో పైలట్ ప్రాతిపదికన e-PoS (ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్) మెషీన్‌లను ప్రవేశపెట్టింది. క్రెడిట్, డెబిట్ కార్డ్‌ల ద్వారా కూడా చెల్లింపులు చేయోచ్చు. పైలెట్ ప్రాజెక్టును రీజనల్ మేనేజర్ చెంగల్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.

సెంట్రల్ బస్ స్టేషన్‌లో విజయవాడకు వెళ్లే బస్సులో ఈ-పోస్ మెషిన్ తో టిక్కెట్‌ జారీ చేయడం ద్వారా పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించారు. మంగళం, తిరుపతి రెండు డిపోల్లో 40 బస్సు సర్వీసులను ప్రారంభించి ఈ సౌకర్యం కల్పించారు. క్రమంగా రీజియన్‌లోని ఇతర డిపోలకు విస్తరిస్తామని చెంగల్ రెడ్డి తెలిపారు.

ఈ-పొస్ తో ఎంతో ఉపయోగమని ఆయన చెప్పారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి మాత్రమే కాకుండా ఖాళీని బట్టి ఏ స్టేజ్ నుండి టిక్కెట్‌లను బుక్ చేసుకునేందుకు ఆన్‌లైన్ టిక్కెట్ జారీ సౌకర్యాన్ని ఉంటుందన్నారు. ప్రయాణీకులకు ఈ సదుపాయం సౌకర్యంగా ఉంటుందని చెప్పారు. కొత్త సదుపాయంతో కస్టమర్‌ కౌంటర్‌లో బుక్ చేసుకోకుండా కార్గో బుకింగ్‌ను అంగీకరిస్తుందన్నారు.

ఆన్‌లైన్ ట్రాకింగ్ సిస్టమ్, బస్సు ప్రయాణంలో ఏదైనా సంఘటనను రికార్డ్ చేయగల వీడియో సదుపాయం కూడా ఉంటుంది. ప్రమాదాలను కూడా రికార్డ్ చేయగలదు. ఫిబ్రవరి 2023 నాటికి ఈ పొస్ మిషిన్లు.. ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు మొదలైన ఇతర సర్వీసులకు విస్తరిస్తుందన్నారు చెంగల్ రెడ్డి. ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు అనుకూలమైన వ్యవస్థను అందుబాటులోకి తెచ్చిందన్నారు. న‌గ‌దు ర‌హిత చెల్లింపులు ఎన్ని ర‌కాలుగా చేయ‌వ‌చ్చునో అన్ని ర‌కాల స‌ర్వీసుల‌ను ఈ పోస్ మిష‌న్లలో పొందుప‌రిచారు. ఈపోస్ మిష‌న్ సిమ్‌కార్డ్ ప‌నిచేయ‌ని స‌మ‌యంలో టికెట్ ఇష్యూయింగ్ మిష‌న్ ను కూడా అందుబాటులో ఉంచ‌ుతారు.

ఆర్టీసీ బస్సుల్లో ప్రస్తుతం టికెట్‌ ఇచ్చేందుకు టిమ్స్‌‌ను వినియోగిస్తున్న విషయం తెలిసిందే. ఈ- పోస్‌ యంత్రాలతో ప్రయాణికులు మొబైల్‌ నంబర్‌తో లింక్ అయిన అకౌంట్ ద్వారా యూపీఐ పేమెంట్స్‌ రూపంలో డెబిట్, క్రెడిట్ కార్డులు, పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా చెల్లించే అవకాశం ఉంది. ఇకపై బస్సుల్లో చిల్లర సమస్యకు ఛాన్సే లేదు. ఆర్టీసీ వ్యాలెట్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే.. అందులో బ్యాలెన్స్ మెయింటెన్ చేస్తే.. టికెట్‌ తీసుకోవడం ఈజీగా ఉంటుంది. టికెట్‌ బుకింగ్‌, బస్‌పాస్‌, కొరియర్‌, కార్గో సేవలకు సంబంధించి ఈ లావాదేవీలు అందుబాటులోకి వస్తాయి.