Telangana Congress: రైతన్నల సమస్యలపై కాంగ్రెస్ పోరుబాట - అజెండా ఇదే..
19 November 2022, 20:46 IST
- రాష్ట్రంలోని రైతన్నల సమస్యలపై పోరుబాట పట్టనుంది తెలంగాణ కాంగ్రెస్. పోడు భూములు, ధరణి, ఇతర భూమి అంశాలు, ధాన్యం కొనుగోలులో సమస్యలపై పోరాటాలు చేయనుంది. ఈ మేరకు టీపీసీసీ కార్యాచరణను ప్రకటించింది.
రైతు సమస్యలపై టీ కాంగ్రెస్ పోరుబాటు
Telangana Congress to Protest On Farmers Problmes: తెలంగాణ కాంగ్రెస్... అన్నదాతల సమస్యలపై పోరాటానికి సిద్ధమైంది. శనివారం పార్టీ ముఖ్యనేతలు జూమ్ సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రభుత్వ విధానాలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఈ నేపథ్యంలో రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ కార్యాచరణను ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వివరాలను వెల్లడించారు.
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు, పోడు భూముల సమస్యలపై పెద్ద ఎత్తున పోరాడాలని టీపీసీసీ నిర్ణయించింది. ధరణి పోర్టల్, ఈ ఏడాది వానాకాలం మార్కెటింగ్ సీజన్లో ధాన్యం సేకరణ, క్షేత్రస్థాయిలో రైతుల ఇబ్బందులపై విస్తృతంగా పోరాడాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. ధాన్యం కొనుగోలు సమస్యలపై పోరాడాల్సిన అవసరం ఉందని ఏకగ్రీవంగా నిర్ణయించారు. ప్రకృతి విపత్తుల కారణంగా 15లక్షల ఎకరాల్లో పంట నష్టపోయిన రైతులకు పరిహారంతో పాటు పెట్టుబడి రాయితీ ఇవ్వాలన్నారు. అసైన్డ్ భూములను సీలింగ్ ల్యాండ్ పేరిట ప్రభుత్వం పేదల భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తోందని తీవ్రంగా తప్పుబట్టారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై కూడా నేతలు సమీక్షించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ పథకం కింద 47లక్షల మందికి రూ.25వేల కోట్లు చెల్లించాల్సి ఉన్న నేపథ్యంలో తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ సీఎం, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించింది తెలంగాణ కాంగ్రెస్. ఇక నుంచి అన్ని మండల కేంద్రాల్లో, జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు రేవంత్రెడ్డి.
ఇందిరాపార్క్ వద్ద రెండ్రోజులు దీక్ష చేపట్టాలని... దశల వారీగా పోరాటాలు చాలా అవసరమన్నారు. తొలుత నియోజకవర్గాల్లో పోరాటాలు చేసి రైతులు, ఇతర వర్గాల నుంచి అభిప్రాయాలు, డిమాండ్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం సమర్పించాలన్నారు. 32 జిల్లాల్లో ఆందోళనలు చేసిన తర్వాత గవర్నర్ను కలిసి వినతిపత్రం ఇవ్వాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేసే దిశగా కార్యకర్తలు కృషి చేయాలని రేవంత్ పిలుపునిచ్చారు.
కార్యాచరణ ఇదే…
ఈ నెల 24న మండలాల కేంద్రాల్లో నిరసనలు
ఈ నెల 30న జిల్లా కేంద్రాల్లో నిరసనలు
వచ్చే నెల 5వ తేదీన - కలెక్టరేట్ల ముందు నిరసనలు చేపట్టనున్నారు.
ఈ భేటీకి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్, ఎమ్మెల్యే శ్రీధర్బాబు, కిసాన్సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, సీనియర్ నేతలు అంజన్కుమార్ యాదవ్, షబ్బీర్ అలీ పాల్గొన్నారు. అయితే ఈ సమావేశాన్ని తీవ్రంగా తప్పుబట్టారు ఆ పార్టీ నేత జగ్గారెడ్డి. ఇలా జూమ్ మీటింగ్ లు పెట్టడం సరికాదని... గాంధీభవన్ లో కూర్చొని మాట్లాడవచ్చు కదా అని ప్రశ్నించారు. ఇదేమైనా ఐటీ కంపెనీనా అని నిలదీశారు. ఆయన వ్యాఖ్యలు మరోసారి పార్టీలోని విబేధాలను బయటపెట్టాయి. మరోవైపు మర్రి శశిధర్ రెడ్డిపై వేటు వేసింది కాంగ్రెస్. ఆరేళ్ల పాటు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.