Paddy Procurement : తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లలో ఉన్న సమస్యలేంటి?
Telangana Paddy Procurement : తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో సమస్యలు ఎదురవుతున్నాయి. మరోవైపు వరికోతలు కూడా జోరుగా సాగుతున్నాయి.
తెలంగాణ(Telangana)లో ధాన్యం కొనుగోళ్లు నడుస్తున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో సమస్యలు ఎదురవుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవలేదు. మరోవైపు వరి కోతలు జోరుగానే సాగుతున్నాయి. కొనుగోళ్లలో జాప్యం జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. తేమ ఎక్కువ ఉందని తిప్పి పంపుతున్నారనే విమర్శలూ ఉన్నాయి. కోటి టన్నుల వరకు ధాన్యం కొనుగోళ్లను(Paddy Procurement) ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ట్రెండింగ్ వార్తలు
ధాన్యం రవాణా కోసం లారీల టెండర్లు, గోనే సంచుల టెండర్లు ఏమయ్యాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఖరీఫ్ సీజన్(kharif season) సంబంధించి.. 1.12 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని ప్రభుత్వం అంచనా వేసినట్టుగా తెలుస్తోంది. 7,067 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 4579 కేంద్రాలకు పైగా ఏర్పాటు చేసి.. సుమారు 8.93 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్టుగా తెలుస్తోంది.
కొన్ని జిల్లాల్లో చాలా తక్కువ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరోవైపు ఇంకొన్ని జిల్లాల్లో వందలు, వేల క్వింటాల్లో మాత్రమే ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. దొడ్డు ధాన్యం మాత్రమే సేకరిస్తున్నారని విమర్శలూ ఉన్నాయి. ధాన్యం అమ్మిన రైతులకు రూ.19 కోట్లకు పైగా చెల్లించారని.. ఇంకా చెల్లించాల్సినవి చాలానే ఉన్నాయని చెబుతున్నారు. దీంతో రైతులు ప్రైవేటు వ్యక్తులకు అమ్మేందుకు మెుగ్గుచూపుతున్నారు. వారు నేరుగా అప్పుడే చెల్లింపులు చేస్తున్నారని చెబుతున్నారు.
రైస్ మిల్లర్లు(Rice Millers), ప్రైవేటు టేడర్లకు అమ్మేందుకు రైతులు(Farmers) ఆసక్తి చూపిస్తున్నారు. వారైతే.. నేరుగా రైతు దగ్గరకే వచ్చి.. కొనుగోళ్లు చేయడంతో కొన్ని ఖర్చులు తగ్గుతున్నాయని చెప్పేవారూ ఉన్నారు. తూకం, చెల్లింపుల్లో జాప్యం జరగడం లేదు. తేమను కూడా ఎక్కువగా పట్టించుకోవడం లేదని రైతులు అంటున్నారు. దీంతో వారివైపే అన్నదాతలు ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్స్, తేమ యంత్రాలు అవసరమైన మేరకు మార్కెటింగ్ శాఖ(Marketing Department) కొనివ్వాల్సి ఉంది. అయితే పూర్తిస్థాయిలో కొనివ్వలేదనే విమర్శలు ఉన్నాయి. అంతకుముందు వినియోగించినవి.. గ్రామ పంచాయతీలు, రైతు వేదికలు, మార్కెట్ యార్డుల్లో ఉంటే.. కొన్ని కనిపించట్లేదు. ఇలాంటి కారణాలతో జాప్యం జరుగుతుందనే విమర్శలు వస్తున్నాయి.
మిల్లుల వద్ద కూడా పలు సమస్యలు వస్తున్నాయి. ధాన్యం తెలంగాణ(Telangana) నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిపోతుందనే ఆరోపణలు ఉన్నాయి. స్థానికంగా ఉన్న రైస్ మిల్లర్ల కంటే.. ఇతర రాష్ట్రాల ట్రేడర్లు ఎక్కువగా ధాన్యం కొనుగోలు చేశారని చెబుతున్నారు. తేమశాతం ఎక్కువ ఉన్నా.. సన్న ధాన్యం రూ.2100 నుంచి 2200 వరకు కొనుగోలు చేస్తున్నారు. 30 శాతం తేమ ఉంటే.. దొడ్డు వడ్లను రూ.1900 వరకు కొంటున్నారు.
మరోవైపు ధాన్యం కొనుగోళ్లు(Paddy Procurement) సజావుగా సాగుతున్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Gangula Kamalakar) చెప్పారు. ఇటీవలే ధాన్యం అధికారులతో చర్చించారు. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ లో ధాన్యం సేకరణ, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు, పురోగతితోపాటు ఇతర అంశాలపై మాట్లాడారు. అవసరాల మేరకు అదనపు కేంద్రాలు తెరుస్తామని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన విధంగా.. రైతులు తేమ లేకుండా.. ఆరబెట్టిన నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు.