TS Govt: ధరణి సమస్యలపై కీలక నిర్ణయం.. ఈ నెల 15 నుంచి రెవెన్యూ సదస్సులు..
రాష్ట్రవ్యాప్తంగా రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న అతి ప్రధానమైన భూసమస్యలపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ధరణి పోర్టల్ (Dharani Portal) సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు.
CM KCR review on Dharani problems: భూరికార్డుల సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిసారించారు. ఇప్పటికే చాలా సమస్యలను పరిష్కరించామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ... చాలా గ్రామాల్లోని సమస్యలు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ మేరకు అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన... ఆదేశాలు జారీ చేశారు.
ట్రెండింగ్ వార్తలు
mandal wise revenue sadassus in telangana: పెండింగ్లో ఉన్న భూరికార్డులు, భూసమస్యల పరిష్కారం కోసం ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. భూసమస్యల పరిస్థితి, వాటి పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించిన ముఖ్యమంత్రి... పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. మండలం కేంద్రంగా మూడు రోజులకు ఒక మండలం చొప్పున 100 బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్, డీఆర్వో, ఆర్డీఓల ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి చెప్పారు.
మరోవైపు రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సంబంధించి ఈ నెల 11వ తేదీన హైదరాబాద్ ప్రగతిభవన్లో అవగాహనా సదస్సు నిర్వహించనున్నారు. అవగాహనా సదస్సుకు మంత్రులు, శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్లు హాజరు కానున్నారు.
Dharani Portal : 2017 సెప్టెంబరు అనంతరం రాష్ట్రంలో చేపట్టిన భూ ప్రక్షాళన కార్యక్రమంలో అనేక తప్పులు దొర్లాయి. వాటిని సరిచేయకుండానే ధరణిలోకి ఎక్కించడం, కొన్నింటిని వదిలివేయడం రైతులకు శాపంగా మారింది. వీఆర్వోల వల్ల సమస్య ఉత్పన్నమైందని ఆ వ్యవస్థను రద్దు చేసిన ప్రభుత్వం వీటి పరిష్కారంలో మాత్రం సరైన చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రంలో 72 లక్షల భూ ఖాతాలుండగా 61.30 లక్షల వ్యవసాయ ఖాతాల సమాచారం స్పష్టంగా ఉందని రెవెన్యూశాఖ గుర్తించింది. ఇవికాక మరో మూడున్నర లక్షల ఖాతాలు ధరణిలోకి ఎక్కాల్సి ఉంది. ధరణిలో నిక్షిప్తమైన పాసుపుస్తకాల్లోనూ ఇబ్బడి ముబ్బడిగా తప్పులున్నాయి. వాటిని కూడా సరిచేయడం లేదని బాధితులు వాపోతున్నారు.
అయితే భూ సమస్యలను పరిష్కరించాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం రెవెన్యూశాఖకు సూచించింది. దీంతోపాటు దాదాపు 40 సమస్యలను గుర్తించి వాటి పరిష్కారాలను సూచిస్తూ రూపొందించిన నివేదికను సీఎం కేసీఆర్కు అందించింది. మొదట ఎనిమిది మాడ్యూళ్లు ఏర్పాటు చేస్తే చాలా సమస్యలు పరిష్కారమవుతాయని సిఫార్సుల్లో పేర్కొంది. అయినప్పటికీ పెద్దగా చర్యలు తీసుకోకపోవటంతో పలు సమస్యలు అలాగే ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలోనే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు సిద్ధమైంది. మరీ ఈ చర్యలతోనైనా ప్రజల సమస్యలు తీరుతాయా అనేది చూడాలి.
టాపిక్