Bharat Jodo Yatras In TS : నన్ను పట్టుకోలేరు.. జోడో యాత్రలో రాహుల్ రన్నింగ్
30 October 2022, 15:38 IST
- Rahul Gandhi Bharat Jodo Yatra : కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రలో ఆదివారం ఆసక్తికర ఘటన జరిగింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్రలో విద్యార్థులతో కలిసి పరుగెత్తారు.
జోడో యాత్రలో రాహుల్ పరుగు
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.. 53వ రోజుకు చేరుకుంది. ఆదివారం ఉదయం జడ్చర్ల మండలం గొల్లపల్లి నుంచి యాత్ర ప్రారంభమైంది. రాహుల్(Rahul)తోపాటుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy), సీనియర్ నేత జానా రెడ్డి పాల్గొన్నారు. యాత్ర జరుగుతున్న సమయంలో రాహుల్ గాంధీ వద్దకు పాఠశాల విద్యార్థులు వచ్చారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఒక్కసారిగా పరుగు(Rahul Gandhi Running) తీశారు. దీంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సెక్యూరిటీ సిబ్బంది కూడా ఆయన వెంట పరుగెత్తారు
53వ రోజు పాదయాత్ర 22 కిలోమీటర్ల దూరం ఉంటుందని కాంగ్రెస్(Congress) వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర ఇది ఐదో రోజు. షాద్నగర్లోని సోలిపూర్ జంక్షన్ వద్ద జరిగే మీటింగ్లో రాహుల్ గాంధీ సాయంత్రం ప్రసంగిస్తారు. శనివారం 20 కిలోమీటర్లకు పైగా పూర్తి చేసి, రాత్రికి జడ్చర్ల ఎక్స్ రోడ్ జంక్షన్ వద్ద యాత్ర ఆగింది.
ఈ యాత్ర నవంబర్ 7న మహారాష్ట్రలో ప్రవేశించడానికి ముందు, రాష్ట్రంలో మొత్తం 375 కి.మీ మేర ఉంటుంది. తెలంగాణ(Telangana)లోని 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాలను కవర్ చేస్తుంది. యాత్రకు నవంబర్ 4న ఒకరోజు విరామం ఇస్తారు. క్రీడా, వ్యాపార, వినోద రంగాలకు చెందిన ప్రముఖులతో సహా మేధావులు, వివిధ సంఘాల నాయకులతో రాహుల్ గాంధీ సమావేశమవుతారు.
తెలంగాణ వ్యాప్తంగా ప్రార్థనా మందిరాలు, మసీదులు, దేవాలయాలను కూడా ఆయన సందర్శిస్తారని తెలంగాణ పీసీసీ సభ్యులు తెలిపారు. భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న తమిళనాడు(Tamil Nadu)లోని కన్యాకుమారి(Kanyakumari) నుంచి ప్రారంభమైంది. గత వారం తెలంగాణలో యాత్రను ప్రారంభించే కంటే ముందు కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక(Karnataka)లో జోడో యాత్రను పూర్తి చేశారు. తెలంగాణలో యాత్రను సమన్వయం చేసేందుకు టీపీసీసీ 10 ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది.
సోమవారం హైదరాబాద్(Hyderabad) నగరానికి రాహుల్ యాత్ర వస్తుంది. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి పార్టీ నేతలు రాహుల్ గాంధీతో సమావేశమయ్యే అవకాశం ఉంది. నియోజకవర్గంలో ప్రచారం, ప్రత్యర్థి పార్టీల వ్యూహాలపై చర్చ జరిగే ఛాన్స్ ఉంది. కొందరు నియోజకవర్గంలోని ప్రముఖులు రాహుల్ తో సమావేశమవుతారు.