TS Police Recruitment Results : వారంలో తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్‌ ఫలితాలు..-ts police recruitment results will release in a week days ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Ts Police Recruitment Results Will Release In A Week Days

TS Police Recruitment Results : వారంలో తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్‌ ఫలితాలు..

HT Telugu Desk HT Telugu
Oct 17, 2022 11:57 AM IST

TS Police Recruitment Results అభ్యర్ధులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ స్టేట్‌ లెవల్ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నియామక ప్రాథమిక పరీక్షా ఫలితాలు త్వరలో విడుదల చేస్తామని ప్రకటించారు. పరీక్షలు పూర్తై రోజులు గడుస్తున్నా ఫలితాలు వెలువడక అభ్యర్ధులు ఎదురు చూపులకే పరిమితమయ్యారు. ఎస్సై, కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగాల నియామకాలకు దాదాపు ఎనిమిదిన్నర లక్షల మంది అభ్యర్ధులు పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.

త్వరలో తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్షా ఫలితాలు
త్వరలో తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్షా ఫలితాలు (HT_PRINT)

TS Police Recruitment Results తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి నిర్వహించిన నియామక పరీక్షల కోసం ఎదురు చూస్తున్న వారికి టీఎస్‌ఎల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు తీపి కబురు అందించింది. పరీక్షా ఫలితాలపై టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ కసరత్తు కొలిక్కి వచ్చిందని త్వరలోనే ఫలితాలను వెల్లడిస్తామని ప్రకటించారు. దాదాపు 8.5 లక్షల మంది అభ్యర్థులు పోలీస్ రిక్రూట్‌ మెంట్ పరీక్షల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్‌ స్థాయి పోస్టులకు నిర్వహించిన ప్రాథమిక పరీక్ష ఫలితాలను వెల్లడించడానికి తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి (TSLPRB) చేస్తున్న కసరత్తు కొలిక్కి వచ్చింది. ఎలాంటి అడ్డంకులు లేకపోతే ఈ వారంలోనే ఫలితాలు వెల్లడించే అవకాశం ఉందని మండలి వర్గాలు తెలిపాయి. ఆగస్టు 7న ఎస్సై, 28న కానిస్టేబుళ్ల పోస్టులకు రాత పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక‌షల ఫలితాలను వాస్తవానికి సెప్టెంబరులోనే వెల్లడించాలని తొలుత మండలి నిర్ణయించింది.

పోలీస్‌ నియామక పరీక్షల్లో ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగ అభ్యర్థులకు కటాఫ్‌ మార్కుల్ని తగ్గిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభలో ప్రకటించడంతో టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వర్గాలు ఫలితాలను వెల్లడించే విషయంలో ముందుకెళ్లలేకపోయాయి. ఈక్రమంలో కటాఫ్‌ మార్కులను బీసీ అభ్యర్థులకు 50కి, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగ అభ్యర్థులకు 40కి తగ్గిస్తూ అక్టోబర్‌ 2న ఉత్తర్వులు వెలువడ్డాయి. ఓసీ అభ్యర్థుల కటాఫ్‌ మార్కులను యథాతథంగా 60గానే ఉంచాలని నిర్ణయించారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులతో తగ్గించిన కటాఫ్‌ మార్కులకు అనుగుణంగా ఫలితాల వెల్లడిపై మండలి కసరత్తు ముమ్మరం చేసింది. 554 ఎస్సై పోస్టులకు 2,47,217 మంది అభ్యర్ధులు పరీక్షలు రాశారు. 16,321 కానిస్టేబుళ్ల స్థాయి పోస్టులకు 6,03,955 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. జవాబు పత్రాల మూల్యాంకనం కొలిక్కి రావడంతో అభ్యర్థుల ఉత్కంఠకు తెరపడనుంది.

ప్రాథమిక పరీక్ష ఫలితాల అంశం కొలిక్కి రావడంతో శారీరక సామర్థ్యం, మెజర్‌మెంట్‌ పరీక్షలను త్వరలో నిర్వహించనున్నారు. నవంబరులో ఈ పరీక్షలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాథమిక రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు పంపించే లేఖల్లోనే వాటిని నిర్వహించే వేదిక, తేదీల వివరాలను టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెల్లడించనుంది.

రాత పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి మొదట పరుగు పందెం పోటీలను నిర్వహిస్తారు. పురుషులు 1,600 మీటర్లు, మహిళా అభ్యర్థులు 800 మీటర్ల పరుగును నిర్ణీత సమయంలో పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన వారిలో నిర్ణీత శరీర ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నవారిని లాంగ్‌జంప్‌, షాట్‌పుట్‌ పోటీల్లో పాల్గొనేందుకు అనుమతిస్తారు. అన్నింటి లోనూ అర్హత సాధిస్తే తుది రాతపరీక్షకు అర్హులుగా పరిగణిస్తారు. వారికి తుది పరీక్షకు హాల్‌టికెట్లను జారీ చేస్తారు.

IPL_Entry_Point