PM Modi Tour : నేడు హైదరాబాద్ కు ప్రధాని మోదీ- నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, టెన్త్ విద్యార్థులకు అలెర్ట్
08 April 2023, 8:56 IST
- PM Modi Tour : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలుతో పాటు పలు అభివృద్ధి పనులను ప్రధాని ప్రారంభిస్తారు.
నేడు హైదరాబాద్ కు ప్రధాని మోదీ
PM Modi Tour Updates: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ(శనివారం) హైదరాబాద్ లో పర్యటించనున్నారు. సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభలో ప్రధాని పాల్గోనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారు. ప్రధాని పర్యటన సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శనివారం ఉదయం 8:30 గంటల నుంచి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నారు. ప్రధానంగా సికింద్రాబాద్ పరిసరాల్లో ఇవాళ ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు వాహనాలకు అనుమతించరు. ఈ క్రమంలో ట్రాఫిక్ను ఇతర మార్గాల్లో మళ్లించనున్నట్టు పోలీసులు తెలిపారు. దీంతో ఉదయం పదో తరగతి పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థులు ఒక గంట ముందే తమ పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని హైదరాబాద్ డీఈవో రోహిణి సూచించారు. ట్రాఫిక్లో చిక్కుకుని పరీక్షకు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది కాబట్టి... గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తం కావాలని డీఈవో రోహిణి సూచించారు.
మోనప్ప జంక్షన్, గ్రీన్ ల్యాండ్స్, ప్రకాష్నగర్, రసూల్పురా సీటీవో, ఫ్లాజా, ఎస్బీహెచ్, వైఎంసీఏ, సెయింట్ జాన్ రోటరీ, సంగీత్ ఎక్స్ రోడ్, అలుగడబావి, చిలకలగూడ జంక్షన్, ఎంజే రోడ్, ఆర్పీ రోడ్, ఎస్పీ రోడ్డు వైపు వెళ్లవద్దని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు వెళ్లే వారు ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందుగానే స్టేషన్కు చేరుకునేందుకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఉప్పల్-సికింద్రాబాద్ మార్గంలో కూడా ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుందని, అందుకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
టివోలీ రోడ్ నుంచి ఫ్లాజా ఎక్స్ రోడ్ వరకు రహదారి ఇరువైపులా మూసివేశారు. ఎస్బీహెచ్ ఎక్స్ రోడ్స్ నుంచి స్వీకర్, ఉపకార్ జంక్షన్ వరకు రహదారిని ఇరువైపులా మూసివేశారు. చిలకలగూడ, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ జంక్షన్, రెటిఫైల్ టీ జంక్షన్ నుంచి వచ్చే వాహనాలకు అనుమి లేదని పోలీసులు తెలిపారు. క్లాక్ టవర్, పాస్పోర్ట్ ఆఫీస్, రెజిమెంటల్ బజార్ మార్గంలో సికింద్రాబాద్ స్టేషన్ మెయిన్ గేట్కు చేరుకోవాలని ప్రయాణికులకు సూచించారు. కరీంనగర్ వైపు నుంచి రాజీవ్ రహదారి మీదుగా నగరానికి వచ్చే వాహనాలను ఓఆర్ఆర్ మీద కొంపల్లి, సుచిత్ర, బాలానగర్, మూసాపేట్, ఎర్రగడ్డ, ఎస్ఆర్ నగర్, అమీర్ పేట వైపు నగరంలోని ఎంటర్ అవ్వాలని సూచించారు. కీసర ఓఆర్ఆర్ గేటు నుంచి ఈసీఐఎల్, మౌలాలి, నాచారం, ఉప్పల్ మీదుగా నగరంలోని ఆయా ప్రాంతాలకు చేరుకోవాలన్నారు. తిరుమలగిరి క్రాస్ రోడ్డు నుంచి ఎడమ వైపునకు వెళ్లి ఏఎస్రావునగర్, ఈసీఐఎల్, మౌలాలి, తార్నాక నుంచి నగరంలోని ఆయా ప్రాంతాలకు వెళ్లవచ్చు. కరీంనగర్ వైపు వెళ్లే వారు తిరుమలగిరి క్రాస్రోడ్, జేబీఎస్ మార్గాల్లో కాకుండా ఓఆర్ఆర్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
ప్రధాని పర్యటన షెడ్యూల్ ఇలా
శనివా ఉదయం 11.30 గంటలకు ప్రధాని మోదీ హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 11.35 గంటలకు రోడ్డు మార్గంలో బేగంపేట నుంచి సికింద్రాబాద్ కు బయలుదేరి... ఉదయం 11.45 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. 11.45 గంటల నుంచి 11.47 వరకు రైల్వే అధికారులు ప్రధాని మోదీకి ఘనంగా స్వాగతం పలుకుతారు. 11.47 గంటల నుంచి 11.55 వరకు సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రధాని పరిశీలిస్తారు. ఫస్ట్ కోచ్ లో చిన్నారులతో ప్రధాని మోదీ కాసేపు సరదాగా మాట్లాడతారు. 11.55 గంటల నుంచి 12 గంటల మధ్యలో సికింద్రాబాద్-తిరుపతి మధ్య తిరిగే వందే భారత్ రైలుకు జెండా ఊపి ప్రధాని మోదీ ప్రారంభిస్తారు.
భారీ బహిరంగ సభ
వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభం అనంతరం ప్రధాని మోదీ 12.15 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ కు చేరుకుంటారు. కేంద్రమంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్నారు. అనంతరం 12.37 నుంచి 12.41 గంటల మధ్యలో పలు రహదారి ప్రాజెక్టులను ప్రధాని వర్చువల్ రూపంలో శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా బీబీ నగర్ ఎయిమ్స్ కు శంకుస్థాపన చేస్తారు. వీటితో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అభివృద్ధి పనులు, సికింద్రాబాద్ - మహబూబ్ నగర్ మధ్యలో రైల్వే డబులింగ్ పనులతో పాటు విద్యుత్ పనులకు, సికింద్రాబాద్-మేడ్చల్ మధ్యలో ఎంఎంటీఎస్ సర్వీసులను ప్రధాని వర్చువల్ గా ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.50 నుంచి 1.20 గంటల నధ్య ప్రధాన మోదీ ప్రసంగం ఉంటుంది. సభ ముగిసిన అనంతరం ప్రధాని మోదీ బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుని...విమానంలో దిల్లీకి తిరుగు పయనమవుతారు. ప్రధాని మోదీ బహిరంగ సభకు ఇప్పటికే పెద్ద ఎత్తున బీజేపీ శేణ్రులు పరేడ్ గ్రౌండ్ కు చేరుకుంటున్నాయి.