Hyderabad News : అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన మహిళలు.. పోలీసుల విచారణ
27 September 2022, 18:31 IST
- Hyderabad Durgamata Idol Vandalising : హైదరాబాద్ లోని ఖైరతాబాద్ చింతల్ బస్తీలో అమ్మవారి విగ్రహం ధ్వంసం ఘటన కలకలం రేపుతోంది. ఇద్దరు మహిళలను సైఫాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ప్రతీకాత్మక చిత్రం
భాగ్యనగరంలో విగ్రహాల ధ్వంసం ఘటన కలకలం రేపుతోంది. ఇద్దరు మహిళలు అమ్మవారి విగ్రహాలను ధ్వంసం చేసినట్టుగా తెలుస్తోంది. పోలీసులు అదుపులో ఉన్న వారు.. మతిస్తిమితం లేనట్టుగా ప్రవర్తిస్తున్నట్టుగా సమాచారం. ఈ ఉదయం ఖైరతాబాద్ చింతల్ బస్తీలో ప్రతిష్టించిన అమ్మవారి విగ్రహానికి పూజ జరుగుతోంది. అదే సమయంలో ఇద్దరు మహిళలు మండపంలోపలికి వచ్చారు. పూజారి వద్దు అన్నా.. వినకుండా తమతో తెచ్చుకున్న రాడ్డుతో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సమయంలో ఓ యువకుడు అక్కడే ఉన్నాడు. వారిని అడ్డుకోవటానికి ప్రయత్నం చేశాడు. అతనిపై దాడి చేసి అక్కడినుంచి వెళ్లిపోయారు.
అయితే ఈ మహిళలు అక్కడతో ఆగకుండా.. సమీపంలోని మరియమాత విగ్రహం దగ్గరకు వెళ్లారు. విగ్రహాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని స్థానికులు వెంటే.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. వారి వద్ద రాడ్, చాకు, ఆయిల్, సర్ఫ్ ప్యాకెట్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. మహిళలు ఇంగ్లీష్ మాట్లాడుతున్నట్టుగా సమాచారం. పోలీసుల ప్రశ్నలకు సరైన సమాధానలు ఇవ్వడం లేదని తెలుస్తోంది. ప్లాన్ ప్రకారమే వచ్చారని స్థానికులు ఆరోపిస్తున్నారు.