Shubman Gill : నీ బౌలింగ్లో సిక్స్ కొడతానని వాడికి ముందే చెప్పా
16 May 2023, 12:18 IST
- Shubman Gill : భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ తన ఆరాధ్య క్రికెటర్లని గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ చెప్పాడు. ఈ ఇద్దరి ఆటను చూసి క్రికెటర్ కావాలని అనుకున్నానని తెలిపాడు.
శుభ్మన్ గిల్
ఐపీఎల్ 2023(IPL 2023) సీజన్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad)తో సోమవారం జరిగిన మ్యాచ్లో శుభ్మన్ గిల్(58 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్తో 101) సెంచరీ చేశాడు. దీంతో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. సెంచరీతో విజయంలో కీలక పాత్ర పోషించాడు శుభ్ మన్ గిల్. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. తన ఇన్నింగ్స్ గురించి గిల్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్తో మ్యాచ్ ఆడితే తనకు పూనకాలు వస్తాయని తెలిపాడు. సన్ రైజర్స్ తోనే ఐపీఎల్ అరంగేట్రం చేసిన తాను.. ఇప్పుడు సెంచరీ కూడా అందుకున్నాని చెప్పాడు. భవిష్యత్ లో మరిన్ని సెంచరీలు సాధిస్తానని అన్నాడు. ప్రత్యర్థి బౌలర్లు, మ్యాచ్ కండిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది.. గత మ్యాచ్ లో దారుణంగా ఫేయిల్ అయ్యాను. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడటం చాలా ముఖ్యమని గిల్ చెప్పుకొచ్చాడు.
'అభిషేక్ శర్మ(Abhishek Sharma) బౌలింగ్లో కొట్టిన సిక్స్ హ్యాపీ అనిపించింది. ఎందుకంటే వాడికి ముందే చెప్పాను. నువ్వు బౌలింగ్ వేస్తే సిక్స్ కొడతానని. అన్నట్లుగానే సిక్స్ కొట్టాను.' అని శుభ్మన్ గిల్ చెప్పుకొచ్చాడు. దేశవాళీ క్రికెట్లో అభిషేక్ శర్మ, శుభ్ మన్ గిల్ పంజాబ్ కు ఓపెనర్లుగా ఆడుతారు. ఈ చనువుతోనే గిల్ ఈ కామెంట్స్ చేశాడు.
తనకు సచిన్ టెండూల్కర్(sachin tendulkar), విరాట్ కోహ్లీ(Virat Kohli) తన ఆరాధ్య క్రికెటర్లని చెప్పిన గిల్.. వారి వల్లే క్రికెటర్ అయ్యానని చెప్పుకొచ్చాడు. తనకు క్రికెట్ అర్ధమైనప్పటి నుంచి కోహ్లీ నా హీరో. ఆట పట్ల అతడికి ఉన్న పిచ్చి, అంకితభావం, ఎనర్జీ నన్ను చాలా.. ప్రోత్సహించాయి. ఆటపై ఎంతో మక్కువ చూపేలా చేశాయని శుభ్మన్ గిల్ చెప్పాడు.
ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 188 పరుగులు చేసింది. శుభ్మన్కు తోడుగా సాయి సుదర్శన్(36 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 47)రాణించాడు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 5 వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్, ఫరూఖీ, నటరాజన్ తలో వికెట్ తీశారు. లక్ష్యచేధనకు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 154 పరుగులే చేసి ఓటమిపాలైంది.