Virat Kohli : గురువు కాళ్లకు నమస్కరించిన శిష్యుడు విరాట్ కోహ్లీ
Virat Kohli : తన చిన్ననాటి కోచ్ ను విరాట్ కోహ్లీ మైదానంలో కలిశాడు. ఈ సందర్భంగా గురువు కాళ్లకు నమస్కరించాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది.
దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో దిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్కు ముందు దిల్లీ మైదానంలో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. RCB ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli) తన చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మను మైదానంలో కలిశాడు. ఈ సందర్భంగా ఆయన పాదాలను తాకి నమస్కరించాడు.
ఈ వీడియోను ఐపీఎల్(IPL) తన అధికారిక ట్విట్టర్, సోషల్ మీడియా హ్యాండిల్స్లో షేర్ చేసింది. మైదానంలో తన చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మను చూసిన కోహ్లి వేగంగా అతని వైపునకు వెళ్లాడు. గురువు పాదాలకు నమస్కరించాలని ఆలోచిస్తూ, తన చేతి గ్లౌజులను తీసివేసాడు కోహ్లీ. ముందుకు వచ్చి కోచ్ పాదాలను తాకి నమస్కరించాడు. ఇది నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. కాళ్లకు నమస్కరిస్తున్న సమయంలో గ్లౌజ్ ను తొలగించడం అభిమానులను ఆకట్టుకుంది.
కోహ్లికి కోచింగ్ ఇచ్చిన సంఘటనను గుర్తు చేస్తూ, చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ, కోహ్లీ తన తొలినాళ్లలో సీనియర్ ఆటగాళ్లతో ప్రాక్టీస్ చేయడానికి ఇష్టపడేవాడని వెల్లడించాడు.
'అతను మొదట నా దగ్గరకు వచ్చినప్పుడు, నేను అతనిని అండర్-11 జట్టులో ఉంచాను. అయితే జూనియర్లతో ఆడుకోవడం కోహ్లీకి ఇష్టం లేదు. సీనియర్లతో ఆడుకోవాలనిపిస్తుంది అని చెప్పేవాడు. నువ్వు చాలా చిన్నవాడివి కాబట్టి నీ వయసు పిల్లలతో ఆడుకో అని చెప్పాను. నేను వారితో ఆడగలనని కోహ్లీ అనేవాడు.' అని అరుణ్ జైట్లీ స్టేడియంలో దిల్లీతో మ్యాచ్కు ముందు రాజ్కుమార్ చెప్పాడు.
ఐపీఎల్లో శనివారం(మే 06) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు... దిల్లీ క్యాపిటల్స్ జట్టుతో తలపడింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal challengers Bangalore)పై దిల్లీ క్యాపిటల్స్ సులభంగా గెలిచింది. పోటాపోటీ లక్ష్యాన్ని అందించినప్పటికీ.. డిఫెన్స్లో పోరాడిన ఆర్సీబీ జట్టు(RCB Team) సాల్ట్ మెరుపుల ముందు ఓడిపోయింది. దిల్లీ క్యాపిటల్స్ కు 181 పరుగుల లక్ష్యాన్ని పెట్టిన ఆర్సీబీ.. ఫీల్డింగ్లో విఫలమైంది. దీంతో 16.1 ఓవర్లలోనే దిల్లీ జట్టు విజయం సాధించింది.