PM Modi in 'Invest Karnataka 2022' meet: ‘బెంగళూరు అంటేనే టాలెంట్, టెక్నాలజీ’
02 November 2022, 15:29 IST
- PM Modi in 'Invest Karnataka 2022' meet: బెంగళూరు నగరం టెక్నాలజీకి, నైపుణ్య ఉద్యోగులకు మారు పేరుగా నిలిచిందని ప్రధాని మోదీ ప్రశంసించారు. బెంగళూరులో జరుగుతున్న అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సును ఉద్దేశించి మోదీ ప్రారంభోపన్యాసం చేశారు.
'Invest Karnataka 2022' meet ను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ
PM Modi in 'Invest Karnataka 2022' meet: అంతర్జాతీయంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత సమయంలో ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపే ఆశగా చూస్తున్నాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలకు భారత్ ఒక్కటే ఆశాజ్యోతిగా కనిపిస్తోందన్నారు.
PM Modi in 'Invest Karnataka 2022' meet: 2047కి అభివృద్ది చెందిన దేశం
2047 నాటికి భారత్ ను అభివృద్ది చెందిన దేశంగా మార్చడానికి కృషి చేయాలని ప్రధాని కోరారు. అందుకు అంతర్జాతీయ పెట్టుబడులు అవసరమన్నారు. విప్లవాత్మక సంస్కరణలు, సరైన మౌలిక వసతులు, అత్యున్నత నైపుణ్యాల ద్వారానే న్యూ ఇండియా సాధ్యమవుతుందన్నారు. బెంగళూరులో జరుగుతున్న అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు 'Invest Karnataka 2022'ను ఉద్దేశించి ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రసంగించారు. ఈ Global Investors' Meet బుధవారం నుంచి మూడు రోజుల పాటు జరగనుంది.
PM Modi in 'Invest Karnataka 2022' meet: రెడ్ టేప్ నుంచి రెడ్ కార్పెట్
గత ప్రభుత్వాల పాలనలో భారత్ లో వ్యాపారం చేసుకునేందుకు అనుమతులు లభించడం గగనమయ్యేదని, తమవారికే అవకాశాలు ఇచ్చేవారని మోదీ విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పద్ధతిని మార్చామని రెడ్ టేప్ స్థానంలో పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ పరిచే సంస్కృతిని తీసుకువచ్చామని వివరించారు. విధాన పరమైన అనుమతుల విషయంలో సింగిల్ విండో విధానంతో ఇన్వెస్టర్లకు ఇబ్బందులు తొలగించామన్నారు.
PM Modi in 'Invest Karnataka 2022' meet: కర్నాటక బెస్ట్
కర్నాటక లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉందని, అందువల్ల అభివృద్ధి శరవేగంగా సాగుతోందని ప్రధాని వ్యాఖ్యానించారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉండడాన్ని మోదీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వంగా వ్యవహరిస్తారన్న విషయం తెలిసిందే. టెక్నాలజీ అన్నా, టాలెంట్ అన్నా వెంటనే గుర్తొచ్చే పేరు బెంగళూరు అని, అది బ్రాండ్ బెంగళూరు(Brand Bengaluru) అని ప్రధాని పేర్కొన్నారు. కర్నాటక భారత్ లోని ఇతర రాష్ట్రాలతోనే కాదు, కొన్ని దేశాలతోనూ టెక్నాలజీ, ఎంప్లాయిమెంట్ తదితర రంగాల్లో పోటీ పడుతోందన్నారు. గత సంవత్సరం కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా భారత్ కు 84 బిలియన్ డాలర్ల FDI లు వచ్చాయని ప్రధాని గుర్తు చేశారు.