Crime | టిఫిన్లో ఉప్పు ఎక్కువైందని- భార్యను చంపిన భర్త..!
16 April 2022, 14:50 IST
- మహారాష్ట్ర: వారికి పెళ్లి జరిగి దశాబ్దాలు గడిచిపోయాయి! ఎప్పటిలాగే భర్తకు టిఫిన్ చేసి పెట్టింది ఆ మహిళ. అది తిన్న భర్తకు చిర్రెత్తుకొచ్చేసింది. టిఫిన్లో ఉప్పు ఎక్కువైందని చెప్పి.. భార్య గొంతు నులిమి చంపేశాడు ఆ వ్యక్తి. ఈ ఘటన ఠాణెలో జరిగింది.
టిఫిన్లో ఉప్పు ఎక్కువైందని భార్యను చంపిన భర్త
మహారాష్ట్రలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. టిఫిన్లో ఉప్పు ఎక్కువైందని చెప్పి.. 40ఏళ్ల భార్యను కడతేర్చాడు ఓ కిరాతక భర్త.
ఉప్పు కాస్త ఎక్కువైందని..
ఠాణెలోని భయందర్ టౌన్షిప్లో శుక్రవారం ఉదయం జరిగింది ఈ ఘటన. ఎప్పటిలాగే.. భర్తకు టిఫిన్ పెట్టింది ఆ మహిళ. అది తిన్న వెంటనే అతడికి ఎక్కడలేనంత కోపం వచ్చేసింది.
"నిందితుడి పేరు నిలేష్ గాఘ్(46). శుక్రవారం ఉదయం టిఫిన్ చేశాడు. సుమారు 9:30 గంటల సమయంలో భార్య గొంతు నులిమి చంపేశాడు. భార్య చేసిన కిచిడిలో ఉప్పు ఎక్కువైందనేది కారణం," అని అధికారులు వెల్లడించారు. ఓ పొడవాటి గుడ్డ సాయంతో అతను సొంత భార్య గొంతు నులిమి హత్య చేశాడని వివరించారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి పరుగులు తీశారు. మహిళ మృతదేహాన్ని ఫోరెన్సిక్ టెస్టుల కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు.
టిఫిన్ పెట్టలేదని మామ కాల్పులు..!
మహారాష్ట్రలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. టిఫిన్ పెట్టలేదన్న కారణంతో కోడలిపై ఓ 76 ఏళ్ల వృద్ధుడు కాల్పులు జరిపిన ఘటన సంచలనంగా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల వివరాల ప్రకారం..
కాశీనాథ్ పాండురంగ్ పాటిల్ (76)కు కోడలు టీ అందించింది. అయితే టిఫిన్ ఇవ్వకపోవటంపై ఆగ్రహానికి గురయ్యాడు. ఏకంగా తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో కోడలి(42) పొట్టలోకి బులెట్ దూసుకెళ్లింది. గురువారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఘటన జరిగింది. వెంటనే కుటుంబ సభ్యులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతోంది.
నిందితుడిపై ఐపీసీ 307, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు రాబోడి పోలీసు స్టేషన్ సీఐ సంతోష్ ఘట్కేర్ పేర్కొన్నారు. ఇంకా నిందితుడిని అరెస్ట్ చేయాల్సి ఉందని.. అదుపులోకి తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ ఘటనకు క్షణికావేశం కారణమా..? లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో కూడా విచారణ చేస్తామని చెప్పారు.
టాపిక్