Crime: తాకట్టు పెట్టిన బంగారం అడిగిన భార్య.. స్క్రూడ్రైవర్ గొంతులో పొడిచిన భర్త
13 April 2022, 9:41 IST
- ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. మూడేళ్లపాటు బాగానే ఉన్నారు.. కానీ బంగారం విషయం వారి మధ్య చిచ్చు రేపింది. దీంతో భార్యనే కడతేర్చాడు కట్టుకున్న భర్త. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో వెలుగు చూసింది.
భార్యను కడతేర్చిన భర్త
వారిది ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కలిసిమెలిసి ముందుకుసాగారు. వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు. సీన్ కట్ చేస్తే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. అంతటితో ఆగలేదు..అగ్ని సాక్షిగా ఏడడుగులు వేసిన భర్తే... భార్యను కడతేర్చాడు.
పోలీసుల వివరాల ప్రకారం...
మూడేళ్ల క్రితం గోదావరిఖని సంజయ్గాంధీనగర్కు చెందిన సుందరగిరి రాజేష్ ఎలిగేడుకు చెందిన రక్షితను ప్రేమ వివాహం చేసుకున్నాడు. భూపాలపల్లిలో పని చేసిన సమయంలో రాజేశ్ కు అప్పులు ఎక్కువగా అయ్యాయి. ఇటీవల గోదావరిఖనికి మక్కా మార్చాడు. కుల వృత్తి చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాడు. అయితే అప్పులు మరింత కావటంతో.. భార్య వద్ద ఉన్న ఐదు తులాల బంగారాన్ని కుదవపెట్టి అప్పు తెచ్చుకున్నాడు.
పుట్టింట్లో శుభకార్యం...
పుట్టింటో శుభకార్యం ఉందని తాకట్టు పెట్టిన బంగారం విడిపించమని భర్తను కోరింది భార్య రక్షిత. ఇలా పదే పదే కోరటంతో.. ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన భర్త.. భార్యను స్క్రూడ్రైవర్ తో గొంతులో పొడిచి హతమార్చాడు. వెంటనే ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. మంగళవారం ఉదయం ఇంట్లో నుంచి వాసన రావడంతో సమీప కాలనీవాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు పరిశీలించగా రక్షిత మృతి చెంది కనిపించింది.
ఈ ఘటనపై మృతురాలి తల్లి ఫిర్యాదు మేరక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు రాజేశ్ పరారీలో ఉన్నాడు.
టాపిక్